అప్పుడు లేవని గొంతు ఇప్పుడేందుకు లేస్తోంది

పచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
 

రంపచోడవరం: టీడీపీ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగితే స్పందించని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారని, అప్పుడు లేవని గొంతు ఇప్పుడేందుకు లేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ధ్వజమెత్తారు. రంపచోడవరంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. విజయవాడలో మానసిన వికలాంగురాలుపై జరిగిన దాడిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందన్నారు. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం అందజేయడమే కాకుండా ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు చేపట్టిందన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ యాప్‌ ఉంటే ప్రతి మహిళకు ఒక సెక్యూరిటీ గార్డు వెంట ఉన్నట్టే అన్నారు. తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలు ఎందుకు ఆ సంఘటనను ఖండించలేదని ప్రశ్నించారు.  

ప్రతి దానిని రాజకీయం చేయడం తగదన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తి వేధింపులకు బాలిక సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబునాయుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. కాల్‌మనీ కేసులో కుటుంబాలను రోడ్డుపై లాగారని విమర్శించారు. వీటిపై ప్రశ్నించిన మంత్రి రోజాను అప్పుడు  ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్‌ చేశారని గుర్తు చేశారు. విజయవాడ సమావేశాలకు పిలిచి పోలీస్‌ వ్యాన్‌లో రోజాను తిప్పిన సంఘటనను చంద్రబాబు గుర్తుతెచ్చుకోవాలన్నారు. 

ముంపు గ్రామాలను నూరుశాతం తరలింపు :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో నిర్వాసితులను బయటకు తరలించామని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. ఒకటి రెండు గ్రామాలకు పునరావాస కాలనీ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అప్పటి టీడీపీ పర్సంటేజీల కోసం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేసి నిర్వాసితుల గురించి పట్టించుకోలేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు నిర్వాసితుల తరఫున మాట్లాడుతున్నరని నిలదీశారు.

వైయ‌స్ఆర్‌ సీపీలో గెలుపొంది టీడీపీకి అమ్ముడు పోయిన వంతల రాజేశ్వరి నిర్వాసితుల కోసం ఏం చేయలేదన్నారు. ఇప్పుడు  న్యాయపోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిర్వాసితుల కోసం రాజేశ్వరి ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి కాలనీలకు తరలించినట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులు అందరికీ న్యాయం చేస్తామన్నారు. పోలరవం ప్రాజెక్టు కోసం వారి జీవితాలను త్యాగం చేశారని, పుట్టి పెరిగిన గ్రామాలను జ్ఞాపకాలను వదిలి వెళ్లిన వారికి ఎంత చేసిన తక్కువేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారన్నారు. నిర్వాసితుల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా వారికి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.   

తాజా వీడియోలు

Back to Top