నూత‌నోత్సాహం

రాష్ట్ర‌వ్యాప్తంగా హర్షాతిరేకాలు

కొనసాగుతున్న సంఘీభావ ర్యాలీలు  

అమ‌రావ‌తి: జిల్లాల పునర్విభజనకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా చల్లపల్లిలో గురువారం భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్కు సెంటర్‌ వద్ద నుంచి లక్ష్మీపురం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి, ఎస్సీ కాలనీ వద్ద వైయ‌స్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

రామానగరం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంతర్భాగం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు. ‘జగనన్న వరం–సర్వేపల్లి జన నీరాజనం’ వారోత్సవాల్లో భాగంగా గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తుకూరులో వైయ‌స్‌ జగన్‌ భారీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.

ఆ ఫ్లెక్సీపై పూలవర్షం కురిపించారు. వైయ‌స్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ముత్తుకూరు కూడలిలో జరిగిన సభలో కాకాణి ప్రసంగించారు. గతంలో చంద్రబాబు చేయలేని పనిని ప్రస్తుత సీఎం వైయ‌స్‌ జగన్‌ చేసి చూపారని కొనియాడారు. ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకటరమణయ్య,  వైయ‌స్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మెట్ట విష్ణువర్ధనరెడ్డి, సర్పంచ్‌ బూదూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Back to Top