అమ‌రావ‌తి అభివృద్ధిపై వైయ‌స్ జ‌గ‌న్‌కు ఓ విజ‌న్ ఉంది

పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌

 హైదరాబాద్‌: రాజధాని అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై వైయ‌స్‌ జగన్‌కు స్పష్టమైన విజన్‌ ఉందని పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్  తెలిపారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా చూశారని చెప్పారు. విజయవాడ అభివృద్ధే తన ఎజెండా అని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ అన్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత విజయవాడ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. తాను పుట్టిపెరిగిన విజయవాడను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు చెప్పారు. తనకు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తానని అన్నారు. 
పాదయాత్ర స్ఫూర్తితో చేరా: రత్నబిందు
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం​ చాలా సంతోషంగా ఉందని విజయవాడ మాజీ మేయర్‌ రత్నబిందు అన్నారు. వైయ‌స్‌ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంతో తాను మేయర్‌గా పనిచేశానని, ఆయన కుటుంబంలోకి మళ్లీ రావడం​ హ్యాపీగా ఉందని తెలిపారు. వైయ‌స్ఆర్‌  ప్రవేశపెట్టిన పథకాలను జనంలోకి తీసుకెళ్లడం వైయ‌స్‌ జగన్‌ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వైయ‌స్‌ జగన్‌ చేసిన పాదయాత్ర స్ఫూర్తితో పార్టీలో చేరినట్టు తెలిపారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Back to Top