వైయ‌స్ కుటుంబం జోలికొస్తే స‌హించేది లేదు

వ్య‌క్తిత్వ హ‌ననానికి పాల్ప‌డితే చూస్తూ ఊరుకోం

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పోతిన వెంక‌ట మ‌హేష్ హెచ్చ‌రిక‌

 తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పోతిన మ‌హేష్‌

జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయ‌న వ్య‌క్తిగ‌తం

దానికి వైయ‌స్ఆర్‌సీపీకి, సాక్షి యాజ‌మాన్యానికి సంబంధం లేదు

 ఆ మాటల‌ను అడ్డం పెట్టుకుని మా పార్టీపై బుర‌ద‌జ‌ల్ల‌డం సరి కాదు

 ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను డైవ‌ర్ట్ చేయ‌డ‌మే కూట‌మి స‌ర్కార్ ఎత్తుగడ

 మండిపడ్డ పోతిన వెంక‌ట మ‌హేష్‌.

తాడేప‌ల్లి: జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షిటివి డిబేట్‌లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైయస్ఆర్‌సీపీకి, సాక్షిటివి యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైయస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కరా్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైయస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననంకు వాడుకుంటోందని మండిపడ్డారు. మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షిటివి, వైయస్ఆర్‌సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...
 
గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో టీవీ డిబేట్ల‌లో, ప‌బ్లిక్ మీటింగుల్లో కూర్చుని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులే ఇష్టారాజ్యంగా మాట్లాడిన‌ప్పుడు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ5, ఏబీయ‌న్ ఛానెళ్ల ముందు ఎందుకు ధ‌ర్నాలు నిర్వ‌హించ‌లేదు? ఆ ప‌త్రిక‌ల ప్ర‌తుల‌ను ఎందుకు త‌గ‌ల‌బెట్టలేదు? టీడీపీ నాయ‌కులు మాట్లాడిన సందర్భాల్లో వారి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌లేదా? టీడీపీ నాయ‌కులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిర‌ణ్‌ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్ర‌ద‌ర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, హోంమంత్రి అనిత వైయ‌స్ కుటుంబం గురించి, వారి ఇంటి మ‌హిళ‌ల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా న‌మోదు చేయ‌లేదు. నాడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ను ఉద్దేశించి ప‌దే ప‌దే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాన్ నా కొడ‌క‌ల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్ద‌రి మీద కూడా ఎందుకు కేసులు పెట్ట‌లేదు? 

ఐటీడీపీ పేరుతో రెచ్చిపోతున్న సైకోలు 

వ్య‌క్తిత్వ హ‌న‌నం అనేది టీడీపీ జీన్స్ లోనే ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి నేటి వైయ‌స్ జ‌గ‌న్ వ‌ర‌కు వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయ‌డ‌మే ఎజెండాగా సైకోల‌ను ప్రోత్స‌హించడమే టీడీపీ ప‌నిగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా తోడేళ్లు వైయ‌స్ కుటుంబంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఐ-టీడీపీ పేరుతో నారా లోకేష్‌ ఒక సైకో వ్య‌వ‌స్థ‌ను సృష్టించి డ‌బ్బులిచ్చి పోషిస్తున్నాడు. చంద్ర‌బాబు ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీడియోలు చేస్తున్నాన‌ని టీడీపీ సైకో చేబ్రోలు కిర‌ణ్ స్ప‌ష్టంగా చెప్పాడు. అధికారం అండ చూసుకుని, రెడ్ బుక్ రాజ్యాంగం పొగ‌రుతో ఏం చేసినా పోలీసులు మ‌న‌ల్ని ఏం చేయ‌రులే అని తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా సైకోలు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. వైయ‌స్ కుటుంబాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్ర‌స‌క్తేలేదు. 

మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతుంటే ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దు

మ‌హిళల మీద అత్యాచారాలు, దాడులు జ‌రుగుతుంటే ఈ ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ద‌ళిత బాలిక‌పై సామూహిక అత్యాచారం చేస్తే ఇంత‌వ‌ర‌కు కేసు న‌మోదు చేసి నిందితుల‌ను శిక్షించ‌లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హోంమంత్రి అనిత‌, మంత్రి నారా లోకేష్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హిళ‌ల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమ‌ర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి 9 నెల‌లు దాటినా ఇంత‌వ‌రకు బాలిక మృత‌దేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్ర‌భుత్వం ఘోరంగా ఫెయిలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళిత మీద దాడులు నిత్య‌కృత్య‌మైపోయాయి. పిఠాపురంలో ఏకంగా ద‌ళితుల‌ను సాంఘిక బ‌హిష్క‌ర‌ణ చేసినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ దానిపై ఇంత‌వ‌ర‌కు నోరుమెద‌ప‌లేదు. ఈ ఘోరాల‌పై నోరెత్తి మాట్లాడే తీరిక ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు లేదు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన డీజీపీ ఎక్క‌డున్నారో తెలియ‌దు. రాజ‌ధాని పేరుతో అమ‌రావ‌తి భూముల‌ను దోచుకోవ‌డ‌మే అజెండాగా చంద్రబాబు ప‌నిచేస్తున్నాడ‌ని రాజ‌ధాని రైతులు, మ‌హిళ‌లు గుర్తించాలి. అమ‌రావ‌తిలోని వంద‌ల ఎక‌రాల భూముల‌ను త‌న బినామీల కంపెనీల‌కు చంద్ర‌బాబు దోచిపెట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. గ‌తంలో సేక‌రించిన భూముల‌నే అభివృద్ధి చేయ‌లేక చేతులెత్తేసిన సీఎం చంద్ర‌బాబు, మ‌ళ్లీ 44 వేల ఎక‌రాలు సేక‌రిస్తాన‌ని చెప్ప‌డం భూములు దోచుకునే కుట్ర‌లో భాగ‌మే.

Back to Top