అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్ నంబర్ –1లో తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై..సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అనంతరం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తదుపరి ఫలితాలు ప్రకటిస్తారు.
శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైయస్ఆర్సీపీ కి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైయస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది.
ఈ క్రమంలో వాస్తవంగా చూస్తే.. ఒక్క స్థానం గెలవడానికి కూడా టీడీపీకి బలం లేదు. అయినా సరే అభ్యర్థిని బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది.