స‌త్తెన‌ప‌ల్లిలో పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌

‘క్విట్‌ కోడెల..సేవ్‌ సత్తెనపల్లి’ పేరుతో నిరసన 

కోడెల కుటుంబానికి వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్ సీపీ ధ‌ర్నా

మ‌హిళా నేత‌ల‌ను ఈడ్చిప‌డేసిన పోలీసులు

సత్తెనపల్లి: ‘క్విట్‌ కోడెల..సేవ్‌ సత్తెనపల్లి’ పేరుతో నిరసన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ఆందోళ‌న ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. శుక్ర‌వారం శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై పోలీసులు ఓవ‌రాక్ష‌న్ చేశారు. మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా బ‌ల‌వంతంగా ఈడ్చికెళ్లారు. ఈ ఘ‌ట‌న‌ను వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. మ‌రోవైపు వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు, త‌దిత‌రుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ధ‌ర్నా కోసం వేసిన టెంట్ల‌ను తొల‌గించారు. ఈ చ‌ర్య‌లు దుర్మార్గ‌మ‌ని అంబ‌టి రాంబాబు ఖండించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల, ఆయన కుమారుడు, కుమార్తె చేస్తోన్న అవినీతి, అక్రమాలకు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.  సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో ‘క్విట్‌ కోడెల – సేవ్‌ సత్తెనపల్లి’ పేరుతో నిరసన కార్య‌క్ర‌మం చేప‌డితే పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని ఉద్య‌మాన్ని అణ‌చివేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు.  

గత పదేళ్ల కాలంలో నమోదు కాని కేసులు, కోడెల స్పీకర్‌ అయ్యాక మూడు నెలలకే ప్రత్యర్థులపై నమోదు చేయించారని తెలిపారు. లక్కరాజుగార్లపాడులో తనకు ఓటు వేయలేదని ఇళ్లు ధ్వంసం చేసి అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. పార్కు ఏరియాలో అపార్టుమెంట్‌ నిర్మాణం చేపడుతుంటే అధికారుల ద్వారా పనులు ఆపించి ముడుపులు సెటిల్‌ చేయించుకున్నారని వివరించారు. దాదాపు 67 ఎకరాలు కబ్జా చేశారని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలను కూడా తీవ్ర వేధింపులకు గురి చేశారని తెలిపారు. కోడెలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్నారు. ప్రజలను, వ్యవస్థలను భయపెట్టడం, కులాలను, వర్గాలను, ముఠాలను, ప్రాంతాలను, రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనే ఉద్దేశం గల వ్యక్తి అని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లి రూరల్‌ టీడీపీ గెలుచుకోగా, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాలను వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకున్నా దౌర్జన్యంగా పీఠం దక్కించుకున్నారని గుర్తుచేశారు. కోడెలకు ఫ్యాక్షనిస్ట్‌ అని ముద్ర ఉండేదని, ఇప్పుడు తీవ్ర అవినీతి పరుడిగానూ పేరొచ్చిందని దుయ్యబట్టారు. సత్తెనపల్లి, నరసరావుపేట మున్సిపల్‌ కార్మికులతో గుంటూరులో తమ మాల్‌ నిర్మాణ పనులు చేయించిన నీచ సంస్కృతి ఆయన కుటుంబానిదని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కోడెల దుర్మార్గ పరిపాలనను తరిమి కొట్టాలనే ఆలోచన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు రావడం శుభ పరిణామమన్నారు. కోడెల అరాచకాలపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.
 

Back to Top