నెల్లూరులో `హై ఎండ్‌ అల్యుమినియం` పరిశ్రమ

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్‌ కుమార్ ఝ భేటీ అయ్యారు. నాల్కో, మిథానీ సంయుక్త సంస్థ‌ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (యూడీఏఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్‌ అల్యుమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయ‌నున్నారు. రూ. 5,500 కోట్లతో, ఏడాదికి 60,000 మెట్రిక్‌ టన్నుల ప్రొడక్షన్‌ కెపాసిటీతో ఈ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకానుంది. రెండు నుంచి రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్‌ పూర్తవ్వ‌నుంది. దాదాపు 750 – 1000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు ల‌భించ‌నున్నాయి.

ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకువ‌చ్చారు. స‌మ‌స్య‌ల‌ను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారుల‌ను సీఎం ఆదేశించారు. రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచన మేర‌కు సీఎండీలు అంగీక‌రించారు. 

ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జేవీఎన్‌. సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Back to Top