విశాఖ: అద్దె మైకులతో రెచ్చిపోయే టీడీపీ నేతలు ఏమయ్యారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నేడు, రేపు టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ అందులో తీర్మానాలు చేసి సాధించేది ఏంటని ఆయన ప్రశ్నించారు. 'ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం చేస్తావు బాబూ? కుప్పంలో ఎందుకు కంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో ఆ జూమ్ నాడులో ఏడవండి. ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన?' అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 'జూమ్ మీటింగ్ అనగానే వాలిపోయే పచ్చ నేతలు ఒక్కరూ నియోజకవర్గాల్లో కనిపించరు. ప్రజలను గాలికొదిలేశారు సరే పరామర్శల కోసం విశాఖ వచ్చిన లోకేశంనూ పట్టించుకోలేదు. అద్దె మైకులతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కూన, గంటా ఏమైపోయారు? లోకేశం అంటే అచ్చన్నకున్న అభిప్రాయమే అందరిదా?' అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.