విజయవాడ: తెలుగు దేశం పార్టీని టెంపుల్స్ డిమాలిషన్ పార్టీగా చంద్రబాబు దిగజార్చారని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. 'అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డంగా ఉన్నాయని విజయవాడలో 39 గుళ్లను నేలమట్టం చేశాడు. ఇప్పుడు అధికారం కోసం ఆలయాలను కూల్చి అరాచకం సృష్టించాలని కుట్రలు చేస్తున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీని టెంపుల్స్ డిమాలిషన్ పార్టీ (టీడీపీ)గా దిగజార్చాడు. పతనం ఇంతటితో ఆగదు' అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
కాగా, సీఎం వైయస్ జగన్ పాలనలో ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. 'అన్ని ప్రాంతాల అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్ గారి ప్రత్యేక శ్రద్ధ. భీమిలి నుంచి భోగాపురం వరకూ తీరంలో ఆరు లైన్ల బీచ్ రోడ్డు. గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం. మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు... వెయ్యికోట్లతో డీపీఆర్ ఆమోదించేందుకు చర్యలు' అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.