మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతం   

ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి

 ఏపీలో స్త్రీల మాన, ప్రాణాలకు భద్రత లేదు

మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం విఫలం

గిరిజన విద్యార్థిని తన్మయిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే 

నైతిక బాధ్యత వహిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం, హోమంత్రి రాజీనామా చేయాలి

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్

తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతం అయ్యాయని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ నేతృత్వంలో మహిళలు స్వచ్చందంగా ఈ నిరసనల్లో పాల్గొని, ప్రభుత్వ నిర్లక్ష్య పాలనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని అన్నారు. కూటమి ఏడాది పాలనలో రాష్ట్రలో స్త్రీల మాన, ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన మహిళాగ్రహమే ఒక నిదర్శనమని వెల్లడించారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...

రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తూ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నిర్వహించిన నిరసనల్లో ప్రతి చోటా   మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కూటమి పాలనలో తమకు రక్షణ లేదని గళమెత్తారు. ఏడాది కాలంగా మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కూటమి ఏడాది పాలనలో 188 మహిళలు, బాలికలు అత్యాచారానికి గురైతే, 15 మందిని రేప్ చేసి, చంపేశారు. మహిళలపై దాడులకు సంబంధించి రోజుకు 70 నుంచి 80 కేసులు నమోదవుతున్నాయని ఇటీవల శాసనసభలోనే ప్రభుత్వం అంగీకరించింది. అంటే గంటకు మూడు, నాలుగు కేసులు నమోదువుతున్నాయి. ఈ రాష్ట్రంలో మహిళలు ఇంటా, బయటా ఎక్కడా రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారు. పోలీసులను కక్షసాధింపు కోసం, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు కోసమే వాడుకుంటున్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. 

 తన్మయి హత్యకు సమాధానం చెప్పండి

తాజాగా అనంతపురంలో గిరిజన విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు గురైంది. ఆరు రోజుల కిందటే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు కనీసం స్పందించలేదు. ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోసేందుకు ముందుడే హోంమంత్రి ఇటువంటి ఘటనలపై కనీసం స్పందించలేదు. విద్యార్థిని అదృశ్యంపై అనుమానితుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఇచ్చినా కూడా పోలీసులు వాటిపై దర్యాప్తు చేయలేదు. చివరికి పోలీసుల నిర్లక్ష్యంవల్లే విద్యార్థిని హత్య జరిగిందని జిల్లా ఎస్పీ అంగీకరిస్తూ, సంబంధిత సీఐని సస్పెండ్ చేశారు. ఇక్కడితో ఇది సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు జిల్లా ఎస్సీ, డీజీపీ, హోంమంత్రి, రాష్ట్రప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి రాజీనామా చేయాలి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పద్నాలుగేళ్ళ బాలికను పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు వీడియోలు తీస్తూ, అత్యాచారం చేశారు. అసలు మనం ప్రజాస్వామిక వ్యవస్థలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు కావడం వల్ల వారిని రక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. దీనిపై వైయస్ఆర్‌సీపీ ఆందోళనలు నిర్వహించడంతో కొద్దిమందిని అరెస్ట్ చేశారు. 

కూటమి పార్టీల అండతోనే మహిళలపై అఘాయిత్యాలు

మద్యం, గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడంతో ప్రభుత్వం విఫలమైంది. ఇవ్వన్నీ డోర్ డెలివరీ అవుతున్నాయి. రాష్ట్రంలో డెబ్బై వేల బెల్ట్ షాప్‌లు ఉన్నాయి. సీఎం నివాసం ఉంటున్న జిల్లాలోనే డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. వైయస్ జగన్ హయాంలో మహిళ రక్షణ కోసం దిశాయాప్, దిశా పోలీస్ స్టేషన్‌లను తీసుకువచ్చాయి. 1.30 కోట్ల మంది మహిళలు దిశాయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రక్షణ పొందారు. కూటమి ప్రభుత్వం దిశాయాప్‌ను తొలగించింది. మహిళా భద్రతపై ఒక్క రివ్యూ మీటింగ్‌ కూడా పెట్టలేదు. ఏపీలో మహిళలు సురక్షితంగా బతికే పరిస్థితి లేదా? రాజమండ్రిలో వికాస్ ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణంకు కారకుడైన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడు. గంటూరు జిల్లా తెనాలిలో సహానా అనే దళిత యువతిపై టీడీపీ రౌడీషీటర్ నవీన్ అనే వ్యక్తి కిడ్నాప్‌ చేసి, దాడి చేసిన ఘటనలో ఆమె దారుణ పరిస్థితుల్లో మృతి చెందింది. ఇటువంటి ఘటనల్లో కనీసం హోంమంత్రి స్పందించలేదు. జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తిరుపతిలో లక్ష్మీ అనే మహిళలను ఎలా వేధింపులకు గురి చేశాడో ప్రజలు చూశారు. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వల్ల ఒక మహిళా వీఆర్వో ఆత్మహత్యాయత్నం చేసింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అనే వ్యక్తి ఒక మహిళలను ఎలా లైంగిక వేధింపులకు గురి చేశారో అందరూ చూశారు. జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు పీఆర్ శాఖలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్‌ను లైంగిక వాంఛలు తీర్చాలంటూ, మామూళ్ళు ఇవ్వాలంటూ వేధించడం వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ళ బాలికను గ్యాంగ్‌రేప్ చేసి, ముక్కలుగా నరికి విసిరేశారు. హోంమంత్రి నివాసం ఉంటున్న నగరంలోనే నీరబ్‌శర్మ అనే వ్యక్తి ఒక యువతిపై హత్యాయత్నం చేసి పరారయ్యారు. హోమంత్రి సొంత జిల్లా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో తన కుమార్తెకు ఒక యువకుడి వల్ల ప్రాణహాని ఉందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సదరు యువకుడు ఆ యువతి ఇంటికి వెళ్ళి ఆమె గొంతుకోసి చంపేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.
 

Back to Top