అమరావతి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వైయస్ఆర్ చేయూత పథకం మహిళలకు గొప్ప భరోసానిస్తుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్ఆర్ చేయూత పథకంపై మాట్లాడారు. మహిళల కోసం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ చేయూత పథకం అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక భరోసానందిస్తూ ప్రతి ఏటా రూ.18,750 చొప్పున నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు ఈ ప్రభుత్వం అందిస్తున్న గొప్ప భరోసా అని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ గొప్ప పథకం ద్వారా ప్రభుత్వం నగదు ఇవ్వడమే కాకుండా ఎన్నో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు మన ప్రభుత్వం ఏ సంస్థలు, ఏ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నది మంత్రి వివరించాలని ఎమ్మెల్యే విడదల రజిని కోరారు.