తుని: గత తొమ్మిది నెలలుగా రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాలు అందుతున్నాయనే ఆనందంలో ఉన్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబు తనయుడు మొద్దబ్బాయ్ లోకేష్ మీ నాన్న.. మా నాన్న అని పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తునిలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు రెండు నెలల ముందు ఓట్ల కోసం రూ.2 వేల పింఛన్ అందించారనే విషయం లోకేష్ మర్చిపోయాడా..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. గుంట నక్కలాంటి చంద్రబాబును సింహం లాంటి వైయస్ఆర్తో పోల్చడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్న ఒక్కరోజే 51.5 లక్షల మంది లబ్ధిదారులకు గ్రామ వలంటీర్లు వైయస్ఆర్ పింఛన్ కానుకను అందజేశారన్నారు. గుమ్మం ముందుకే వచ్చి పెన్షన్ ఇస్తుంటే లబ్ధిదారులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని సంబరపడుతున్నారని వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం చూసి చంద్రబాబు, యనమల, ఎల్లోమీడియా కడుపు మండిపోతుందని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. సీఎం వైయస్ జగన్ పాలనలో గత తొమ్మిది నెలలుగా బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతుంటే యనమల రామకృష్ణుడు ఓర్వలేకపోతున్నారన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని తప్పుడు ప్రచారంతో ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.