కర్నూలు జిల్లా : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం కమ్మరచెడు గ్రామంలోని శ్రీరాముల వారి దేవాలయంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన స్పందిస్తూ, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వైయస్ఆర్సీపీ ఎంపీపీ నిధుల నుంచి సుమారు రూ.15 లక్షల వ్యయంతో పైపు లైన్ వేసి గ్రామంలో మంచి నీటి కొళాయిలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే పనిచేయకుండా ఉన్న ఓహెచ్ఆర్ ట్యాంక్ను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు తెర్నేకల్ సురేంద్ర రెడ్డి, మల్లికార్జున రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ అనిల్ కుమార్ రెడ్డి, ఎంఫీపీ రంగమ్మ, మండల కన్వీనర్ మల్లికార్జున, జిల్లా మరియు మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.