ఎల్లోమీడియా రోజురోజుకు దిగజారిపోతోంది

ఐటీ దాడులపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మాట్లాడడం లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

విజయవాడ: అవినీతి పరుడైన చంద్రబాబు భజన చేస్తూ ఎల్లో మీడియా రోజురోజుకు దిగజారిపోతుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలో ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీడీటీ అధికారులు స్పష్టంగా ప్రెస్‌నోట్‌లో చెప్పారని, పెండ్యాల శ్రీనివాస్‌ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అడ్డంగా దొరికిపోయారన్నారు. ప్రాథమిక విచారణలోనే రూ.2 వేల కోట్ల అక్రమ వ్యవహారం జరిగితే.. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే చంద్రబాబుకు సంబంధించిన వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన బయట పడుతుందన్నారు. తన మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ ఇంటిపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తన బినామీ కిలారి రాజేష్‌ కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే లోకేష్‌ ఎందుకు నోరు మెదపడం లేదని, తన కొడుకు శరత్‌కుమార్‌ కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే మాజీ మంత్రి పుల్లారావు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌ రాజధానిలో పర్యటించారన్నారు.

Back to Top