వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర‌వ్వ‌కూడ‌దు

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులపై నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాలి

అధికారుల‌కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని

గుంటూరు: వైద్యం కోసం ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు ఎదురవ్వకూడదని, ఆస్పత్రుల్లో మంచినీరు, పరిశుభ్రత, శుభ్రమైన మరుగుదొడ్లు ఉండేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారుల‌ను వైద్య ఆరోగ్య శాఖ‌మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని ఆదేశించారు. అధికారుల్లో చిత్త‌శుద్ధి ఉంటేనే ఇది సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) విభాగం ఉన్నతాధికారులతో మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం వైయ‌స్‌ జగన్ లక్ష్యమన్నారు. గ్రామస్థాయి నుంచి మెడికల్‌ కళాశాలల బలోపేతం, నూతన వైద్య కళాశాలల నిర్మాణం, ఇతర సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఏకంగా రూ. 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. గడిచిన మూడేళ్లలో వైద్య‌, ఆరోగ్య శాఖ‌లో 40వేలకు పైగా నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కాంట్రాక్ట్‌ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పారు. ప్రతి ఉద్యోగికి ఎక్కడ సమస్య ఎదురైనట్లు గుర్తించినా.. సదరు ఏజెన్సీలపై చర్యలకు వెనుకాడొద్దని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత ఉండకుండా చూడాలన్నారు. టెస్టులు, మందులు బయటకు రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పీహెచ్‌సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా చూడాలన్నారు. 

Back to Top