చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్‌ అంతా ఓ డ్రామా

 
మంత్రి పేర్ని నాని

ఏ ఒక్క ఎమ్మెల్యే చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడలేదు

అసెంబ్లీలో బాబు సతీమణి గురించి ప్రస్తావన రాలేదు

చంద్రబాబు ఏం చెబితే బాలకృష్ణ అది నమ్ముతున్నారు

రాజకీయాలను రాజకీయాలతో ఎదుర్కోవాలి

జరగని విషయాలపై నందమూరి కుటుంబం మాట్లాడటం దురదృష్టకరం

దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబే ఆద్యుడు

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు
 

తాడేపల్లి: చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్‌ అంతా ఓ డ్రామా అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నిన్నటి సభలో చంద్రబాబు సతీమణి గురించి ఏమీ అనలేదని, బాబు దిగజారుడు రాజకీయాలకు తెర లేపారని మండిపడ్డారు. చంద్రబాబు ఏం చెబితే బాలకృష్ణ అది నమ్ముతున్నారని చెప్పారు. శనివారం పేర్ని నాని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

రాజకీయ అవసరాల కోసం ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. 
రాజకీయాలను రాజకీయాలతో ఎదుర్కోవడం అనే విషయాన్ని గాలికి వదిలేసి అసత్యాలతో జరగని విషయాలతో కుటుంబాలను, కుటుంబ మర్యాదను ఫణంగా పెట్టి మెలోడీ డ్రామాకు తెర తీయడం కేవలం నా ఒక్కడికే కాదు..వైయస్‌ఆర్‌సీపీకి, రాజకీయాల్లో ఉన్న అందరికీ బాధాకరం. ఇప్పటికే అసత్యాలతో, నిందాపూర్వక ఆరోపణలతో మానసికంగా కుంగిపోయేందుకు చంద్రబాబు కొత్త రాజకీయాలను తెర తీశారు. చంద్రబాబు మాటలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లందరినీ నేను అడుగుతున్నాను. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరన్నారు..ఏమన్నారు. ఇవతల ఉన్న వారు సంస్కారం లేని వారు అనుకుంటున్నారా? వ్యవస్థలను రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సభలో చంద్రబాబు మైక్‌ కట్‌ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఒకాయన వీడియో తీస్తే క్షణాల్లో విలేకరులకు పంపించారు.ఎక్కడైనా మీరు రికార్డు చేసిన దాంట్లో ఏ వ్యక్తి చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడారో ఒక్క ఆధారం చూపండి.

ఇంత దుర్మార్గంగా, హేయంగా అనని మాటను, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయాల కోసం ఇలాంటివి చేయడం దురదృష్టకరం. వ్యక్తులను, వ్యక్తిత్వాన్ని అసభ్యంగా కించపరిచే సంస్కృతికి తెర తీసింది చంద్రబాబే. రాజకీయాలు ఇంతగా దిగజారడానికి చంద్రబాబే కారణం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను, టీడీపీ వారిని, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..చంద్రబాబు సతీమణి గురించి అసెంబ్లీలో ఎలాంటి ప్రస్తావన రాలేదు. వారి  గురించి ఫల్లెత్తు మాట అనలేదు..ఇది నమ్మండి. చంద్రబాబు చెప్పేవన్నీ అసత్యాలే. ఆయన జరగని విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఇవాళ అంబటి రాంబాబు అనని మాటలను, కాకినాడ ఎమ్మెల్యే అన్నట్లుగా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. చంద్రబాబు మాటలు వారు కూడా బలంగా నమ్మి మాట్లాడరని నేను విశ్వసిస్తున్నాను.

అంబటి రాంబాబు మాటలు అందరూ చూశారు. లైవ్‌లో ఉంది కదా..ఏబీఎన్‌ వద్ద కూడా వీడియో ఉంది కదా? అనని మాటలను మా ఎమ్మెల్యేలకు ఆపాదించి వైయస్‌ఆర్‌సీపీపై రాజకీయంగా పైచెయ్యి సాధించాలని, వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఇవాళ బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ఏదో అన్నట్లు నమ్మి మాట్లాడం నిజం కాదు. బాలకృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా వారి తండ్రి గురించి బు్రరల్లో విషం ఎక్కించారు. వైయస్‌ఆర్‌సీపీ గురించి నమ్మించడం చాలా చిన్న విషయం. ఎన్టీఆర్‌ ఏదో చేశారని, దుర్మార్గుడు, దృష్టుడని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను నమ్మించిన చంద్రబాబు..ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో అన్నారని సృష్టించడం చంద్రబాబుకు చాలా చిన్న విషయం. చంద్రబాబు చరిత్ర చూసుకుంటే..రామారావు కడుపున పుట్టిన వారందరినీ దూరం చేశారు. ఎంతటి విషపు మాటలతో నమ్మించారో ఆలోచించాలి.

ఏ తండ్రినైనా అవమానించడానికి, మానసికంగా కుంగదీయడానికి ఏ పిల్లలు ఒప్పుకుంటారు. ఎన్టీఆర్‌ కుటుంబం అని, మాల మాలో ప్రవహించేది ఎన్టీఆర్‌ రక్తమని గర్వంగా చెప్పుకునే కుటుంబ సభ్యుల బు్రరల్లో విషం ఎక్కించారంటే చంద్రబాబు నేర్పరితనం ఏంటో గమనించాలి. చంద్రబాబు సతీమణిని ఏమి అనకపోయినా, వారి పేరు తీయకపోయినా ఈరకంగా ఆపాదించి దుర్మార్గమైన రాజకీయ ప్రక్రియకు తెర, క్రీడకు తెర లేపడం పైనున్న భగవంతుడే చూడాలి. ఎవరూ మార్చలేరు. మరోసారి చంద్రబాబుకు విజ్ఞాప్తి చేస్తున్నాను..వాస్తవాలు మాట్లాడితే మీ అనుభవానికి ఒక పరమార్థం ఉంటుంది. అనని విషయాలను, జరగని విషయాలను దుష్ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య. నిన్న సావదానంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యవసాయంపై చర్చ జరుగుతుంటే ఇవన్నీ మాట్లాడింది ఎవరూ?

వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి..సభలో సీఎం లేకపోయినా..నిన్న చంద్రబాబు మైక్‌లో పని గట్టుకుని మాట్లాడారు. మీ బాబాయ్‌ హత్య గురించి, గొడ్డలి గురించి, తల్లి–చెల్లి గురించి చర్చిద్దామన్నది చంద్రబాబే.  అసలు రాష్ట్ర రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుదామనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అందరూ వీధుల్లోకి రండి, కొవ్వోత్తులు పట్టుకొండి. నిరసన తెలపమని పిలుపునిస్తున్నారు. ఎందుకు నిరసన, ఏమన్నారని నిరసన తెలుపుతారు. నిరసనకు అర్థం, పరమార్థం ఉండాలి. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తోంది. రైతు చట్టాల రద్దు చేయడాన్ని స్వాగతిస్తూ ఇవాళ మేం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఏడాది పాటు రైతులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకునే వరకు పోరాటం చేశారు. రైతులకు సంఘీభావంగా, ఈ విజయాన్ని రైతులకు అంకితం చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ ర్యాలీ నిర్వహిస్తోంది. రైతు చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వమే మద్దతుగా నిలిచింది. ఏ రాష్ట్రం కూడా ఇలా చేయలేదు. వైయస్‌ జగన్‌ ఆలోచన రైతుల పట్ల ఎలా ఉంటుందో ఇదే నిదర్శనం. ఏడాది పాటు పోరాటం చేసిన రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇవాళ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాం. అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞాప్తి చేస్తున్నాం.

మరొసారి చంద్రబాబు చెబుతున్న అసత్యాలను నమ్మొద్దు. దేవుడి లాంటి ఎన్టీఆర్‌పైనే కన్నబిడ్డలపై, అభిమానులపై విషాన్ని ఎక్కించిన చంద్రబాబుకు నిన్న జరగని సంఘటనను జరిగినట్లుగా చిత్రీకరించి దాన్ని ప్రచారంగా తీసుకెళ్లడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంత దుర్మార్గమైన, వికృతమైన రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వైయస్‌ జగన్‌కు దేవుడే తోడుగా ఉంటారు. 

బాలకృష్ణ ఒక అమాయకపు చక్రవర్తి. వాళ్ల బావ ఏమి చెబితే అదే నిజమని నమ్ముతారు. నిన్నటి హైడ్రామాను కూడా అలాగే నమ్మారు. చెప్పుడు మాటలు విని బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నది మనుషులు, ఆడవాళ్ల గురించి మేమేందకు మాట్లాడుతాం. మాకు బాధ ఉండదా? ఆమాత్రం విజ్ఞత లేకుండా ఎవరూ ఇక్కడ లేరు. మగాళ్లు మగాళ్లు తిడుతున్నారు..తిట్టించుకుంటున్నారు. ఇది అలవాటు చేసింది వాళ్ల బావే కదా? పవిత్రమైన దేవాలయంలో ఇలాంటి సంస్కృతిని అలవాటు చేసింది చంద్రబాబే కదా?. బాలకృష్ణకు మరొక్కసారి చెబుతున్నాం..మీ సోదరి గురించి ఎవరూ ఏమీ అనలేదు. చంద్రబాబు చెప్పేది అసత్యం.

నిన్నటి సభలో మంత్రి కన్నబాబు వ్యవసాయ రంగం గురించి రెండేళ్ల వైయస్‌ జగన్‌ పాలనలో ఏం  చేశారో వివరించి చెబుతున్నారు..వ్యవసాయంపై ఒక్క ప్రశ్న అయినా చంద్రబాబు లేవనెత్తారా? అది లేకపోగా కన్నబాబును పార్టీలు మారావు. చంద్రబాబు పార్టీ మారలేదా? ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానని ఇందిరాగాంధీ వద్ద అనలేదా? . పార్టీ మారలేని వాళ్లు ఎవరున్నారు. బాబాయి–గొడ్డలి అంటున్నారు. అప్పుడు మీరే కదా అధికారంలో ఉండేది. ఆ రోజు వైయస్‌ అవినాష్‌రెడ్డిపై ఎందుకు కేసు కట్టలేదు. ఆ రోజు ఏం చేశారు. 

పురంధేశ్వరి కూడా వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలి. మరది అంటే పడదని ఒక పక్క అంటారు. మరిది దుర్మార్గుడంటారు. ఆయన ఉన్న పార్టీలో ఉండమంటారు.  ఇవాళ ఆయన చెప్పింది ఎలా నమ్ముతారు.గతంలో నమ్మి మోసపోయారు కదా? మీ నాన్న గురించి చంద్రబాబు చెప్పింది నమ్మి మోసపోయారు కదా?ఇంకా ఎన్నిసార్లు మోసపోతారు. సభ్యత, సంస్కారం తెలిసిన నిజమైన రాజకీయ నాయకుడు వైయస్‌ జగన్‌. అదన్నా నమ్మండి అంటూ పేర్నినాని వ్యాఖ్యానించారు. నిన్నటి చంద్రబాబు ఎపిసోడ్‌ ఏపీ చరిత్రలో నిజంగా బ్లాక్‌డేగా మంత్రి అభివర్ణించారు. ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఓ నాయకుడు ఇంతగా దిగజారుతారున్నది ఇంతకన్నా బ్లాక్‌ డే మరొకటి ఉండదని పేర్ని నాని పేర్కొన్నారు.  

 

Back to Top