ప్రజలు మెచ్చే పరిపాలన సాగించాలి

సర్పంచ్‌లకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచన

‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’పై సర్పంచ్‌లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

విజ‌య‌వాడ‌: భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామీణ పరిపాలనలో పెనుమార్పులు తెచ్చారని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు పొందే విధంగా ప్రజాసేవ చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్పంచ్‌లకు సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్, మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు కనిపిస్తున్నాయి. 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి సంక్షేమ పథకాలు గుమ్మం ముందుకే తెచ్చారు. 

గ్రామ సచివాలయ వ్యవస్థను సర్పంచ్‌లు చక్కగా ఉపయోగించుకొని పరిపాలన దక్షులుగా పేరు తెచ్చుకోవాలి. ప్రజాసేవలో నిమగ్నమైన సర్పంచ్‌లను గుర్తించి  సత్కరించడం జరుగుతుంది. సర్పంచ్‌లకు నిధులు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటికే 15 ఫైనాన్స్‌ టైడ్‌ గ్రాంట్‌ కింద రూ.656.2 కోట్లు, అంటైర్‌ గ్రాంట్‌ కింద రూ.652.2 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం రూ.1312.4 కోట్లు స్వచ్ఛ సంకల్పానికి ఖర్చు చేయడానికి ఇవ్వడం జరిగింది. కోవిడ్‌ నియంత్రణ కోసం రూ.387 కోట్లు ఇవ్వడం జరిగింది. 

సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇచ్చేందుకు కొంత ఆలస్యమైంది. 13,095 సర్పంచ్‌లకు గానూ 11,152 మందికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మిగతా 1,943 మందికి ఒకటి రెండు రోజుల్లో చెక్‌ పవర్‌ ఇవ్వడం జరుగుతుంది. జూలై 8వ తేదీన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలు మెచ్చుకునే విధంగా, సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు పొందేలా çసర్పంచ్‌లు పనిచేయాలని కోరుకుంటున్నాం. సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 
 

Back to Top