ఆత్మకూరులో అత్యధిక మెజార్టీ మ‌న‌ లక్ష్యం

ఉప ఎన్నికలో బీజేపీకి భంగపాటు తప్పదు

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: ఈనెల 23న జరిగే ఆత్మకూరు ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, సీఎం ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. విక్రమ్‌రెడ్డి గెలుపు ఖాయమని, అత్యధిక మెజార్టీ సాధనే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఆత్మకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ గడపకూ చేరాయని, ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు. ప్రతి ఓటర్‌ పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు వేసే విధంగా కృషిచేయాలన్నారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి విక్రమ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కష్టపడి పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 

తామంతా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఏమి చేసిందో.. చేస్తుందో చెప్పుకుంటూ పాజిటీవ్‌ ఎజెండాతో ముందుకెళ్తున్నామని, ఉప ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ మాత్రం నెగిటివ్‌ ప్రవర్తనతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని మంత్రి కాకాణి మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలంతా గమనిస్తున్నారని, బుద్ధి తప్పకచెబుతారని హెచ్చరించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. 
 

Back to Top