పెనమలూరు: పింఛన్ కోసం వెళ్లి ఎండదెబ్బ సోకి అకాల మరణం పొందిన వెంపటి వజ్రమ్మ పార్థివదేహానికి మంత్రి జోగి రమేష్ నివాళులర్పించారు. ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికలు కమిషన్ కు చంద్రబాబు సన్నిహితుడు నిమ్మగడ్డ రమేష్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ రోజు పెన్షన్ తీసుకోవడానికి పెనమలూరు మండలంలోని గంగూరు గ్రామంలో వెంపటి వజ్రమ్మ వెళ్లారు. స్థానిక సచివాలయానికి వెళ్లిన ఏ ఆర్ నగర్ ఎస్సీ కాలనీ వాసి వజ్రమ్మ గారు దురదృష్టవశాత్తు తీవ్ర ఎండ దెబ్బకు తాళ లేక మృత్యుఒడికి చేరారు. ఆమె పార్థవదేహాన్ని సందర్శించిన మంత్రి జోగి రమేష్.. పూల మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు. వెంపటి వజ్రమ్మ మరణానికి ఎల్లో బ్యాచ్ కారణమని మంత్రి మండిపడ్డారు. పచ్చబ్యాచ్ ఫిర్యాదుతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరం కావడంతో పింఛన్దారులు అగచాట్లుపడుతున్నారని మంత్రి మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్లో గ్రామ సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయాల వద్దకు వచ్చే పింఛనుదారులు ఎండల కారణంగా ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు.