నంద్యాల: దేశంలోనే సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం వైయస్ జగన్ మంత్రివర్గంలో 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించడమే కాకుండా, మైనార్టీ మంత్రికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తన కేబినెట్లో మైనార్టీలకు స్థానం కల్పించారా? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. నాల్గవ రోజు నంద్యాలలో బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన బడుగు, బలహీన వర్గాలను ఉన్నతస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పెద్దపీట వేశారని చెప్పారు. బీసీ వాల్మీకి కుటుంబానికి చెందిన తనను తొలిసారి కేబినెట్లోకి తీసుకుని మరో రెండున్నరేళ్లు మంత్రి పదవిలో కొనసాగిస్తున్నారన్నారు. అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత పథకం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారన్నారు. మతిస్థిమితం కోల్పోయిన చంద్రబాబు మహానాడులో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఒకలక్షా 40వేల కోట్లు లబ్ధిదారులకు అందిస్తుంటే దానిపై కూడా దోచుకుంటున్నారంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం వైయస్ జగన్ని వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.