శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని రెవెన్యూ రిజిస్ట్రేషన్ , స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే కాలనీలో రూ.1.09 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైయస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను రెవెన్యూశాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ...కొద్దీ రోజులు క్రితం శంకుస్థాపన చేసిన హెల్త్ సెంటర్ ఇవాళ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే సరైన వైద్యం అందదనే భావన రాష్ట్రంతో పాటు దేశం మొత్తమ్మీద ఉంది. అందుకే ఎక్కువ మంది ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తారు. కుటుంబానికి ఉన్న ఆదాయం వైద్యం కోసమే ఎక్కువ ఖర్చు చేస్తారు. పేద కుటుంబానికి అండగా ఉండాలి అంటే ప్రభుత్వాలు మంచి వైద్యం అందించాలి. అదే మన రాష్టంలో జరుగుతుంది. 900 బెడ్స్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకు వచ్చాము. అదేవిధంగా మందులు అందుబాటులో ఉంచాము. మంచి వైద్యులు ఉన్నారు. ఒకసారి గమనించండి. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే ఎలాంటి మార్పులు వచ్చాయో, అన్నది. మన రిమ్స్ ఆస్పత్రికి వెళ్తే తెలుస్తుంది జరిగిన మార్పులు ఏంటన్నవి. నాకు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే జాయిన్ అయ్యాను. సుమారు 65 టెస్టులు ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు లో అందుబాటులో తెస్తున్నాము. వీటన్నింటిపై క్షేత్ర స్థాయిలో వలంటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలి. 6 అర్బన్ హెల్త్ సెంటర్లు మున్సిపల్ పరిధిలో పెడుతున్నాము. ఇవన్నీ బాదుడే..బాదుడులో భాగంగానే చేస్తున్నాం అంటారా ? బ్రోకర్ పనులు చేసేందుకు జన్మభూమి కమిటీలకు అవకాశం లేకుండా పోయింది. అందుకే ఈ తరహా అర్థపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. సూర్యుడు ఉదయించడానికి ముందే వలంటీర్ వచ్చి పెన్షన్ అందిస్తున్నారు. ఆ రోజు పెన్షన్ పెంపు విషయమై చెప్పాము. అమలు చేశాము. ఇచ్చిన మాటను అమలు చేసే క్రమంలో భాగంగా హామీల నెరవేర్పునకు ప్రాధాన్యం ఇచ్చాము. ఇప్పుడు పింఛను కానీ ఇతర పథకాలు కానీ అందాయో లేదో తెలుసుకునేందుకు గడప గడపకూ వస్తున్నాము. అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ చేశాము. పాలన మీ వద్దకే తీసుకు వచ్చాము. ఒకనాటి మాదిరిగా కార్యాలయాలు చుట్టే తిరిగే రోజులుపోయాయి. అన్ని పనులు సచివాలయంలోనే చేస్తున్నాము. లంచం లేని సమాజం నెలకొల్పాము. 12వేల మందికి మున్సిపల్ పరిధిలో ఇళ్ల పట్టాలు ఇచ్చాము. అదేవిధంగా వివిధ అభివృద్ధి పనులకు ఎప్పటికప్పుడు ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాం. ఈ తరుణాన విపక్షాల ఆరోపణలు అర్థరహితం. మేలు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని,మున్ముందు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.కార్యక్రమంలో కలెక్టరు శ్రీకేష్ బి లత్కర్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు, డిఎం&హెచ్ఓ మీనాక్షి, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, నక్క రామరాజు తదితరులు పాల్గొన్నారు.