అన్న క్యాంటీన్లకు మించి భోజనాలు పెడుతున్నాం  

  పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ 

 విశాఖపట్నం: అన్న క్యాంటీన్లు లేకున్నా అంతకు మించి 60 వసతి గృహాలు ద్వారా భోజనాలు పెడుతున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్‌  పేర్కొన్నారు.  టీడీపీ నాయకులు దోచుకుని దాచుకున్న సొమ్మును బయటకు తీసి ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి ట్వీట్‌లు చేస్తుంటే.. టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో కరోనా టెస్ట్‌ల కోసం ఇతర ప్రాంతాలకు శాంపిల్స్‌ పంపించేవారమని.. ఇప్పుడు నేరుగా విశాఖలోనే టెస్ట్‌లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

సహాయం చేయకున్నా పర్వాలేదు.. 
టీడీపీ నేతలు సహాయం చేయకున్నా పర్వాలేదని.. కానీ సాయాన్ని అడ్డుకోవద్దని అవంతి శ్రీనివాస్‌ అన్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నామన్న టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ నీచ రాజకీయాలు వీడి కరోనాపై పోరాటం చేయాలని హితవు పలికారు.  ప్రగతి భారతి ఫౌండేషన్‌కి విరాళాలు ఇవ్వాలని ఎక్కడా ఒత్తిడి లేదని.. ఆ సంస్థ రేషన్‌ లేని పేదలకు కూడా సాయం చేస్తోందని మంత్రి తెలిపారు.  

Back to Top