రాష్ట్రాన్ని పీడిస్తున్న మొదటి దెయ్యం చంద్రబాబు

కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమే బాబు పని

రాయలసీమ లిఫ్ట్‌ను ఆపేయాలని తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న టీడీపీ 

బాబు హయాంలోనే తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు

ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు నోరెత్తడం లేదు

అన్ని ప్రాంతాలు బాగుండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

తాడేపల్లి: ఎప్పుడూ ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకునే నాయకుడు చంద్రబాబు అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. జల వివాదంపై తెలంగాణలో అన్ని పార్టీలు ఒక్కటైతే.. ఏపీలో మాత్రం చంద్రబాబు తన టీవీ ఛానళ్లతో వెధవ రాజకీయం చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ వాదాన్ని ఏపీలో వినిపిస్తున్నాడన్నారు. ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందిపోయి.. చిచ్చుపెట్టే కార్యక్రమం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రానికి నాలుగు దెయ్యాలు తయారయ్యారని, డీ1 చంద్రబాబు, డీ2 రామోజీరావు, డీ3 రాధాకృష్ణ, డీ4 బీఆర్‌ నాయుడు అని ఎద్దేవా చేశారు. తమకు సంబంధించిన వాళ్లు ముఖ్యమంత్రిగా లేకపోతే.. ఈ రాష్ట్రం బాగుండదని, అడ్డమైన రాతలు, అడ్డమైన చేష్టలు చేస్తూ నీచ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారిందన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..  

‘చంద్రబాబు తెలంగాణ వాయిస్‌ను వినిపిస్తున్నాడని ప్రకాశం జిల్లా శాసనసభ్యులు రాసిన లేఖతో స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రతి ఒక్క ప్రాంతానికి మంచిచేస్తూ అందరూ బాగుండాలని భావించే కుటుంబం వైయస్‌ఆర్‌ కుటుంబం. గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదు. 2004లో వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏ ప్రాంతమైనా రాయలసీమ, పోలవరం, శ్రీకాకుళం, తెలంగాణలో దేవాదుల, కాళేశ్వరం అని చెప్పుకుంటున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, ప్రతి ఒక్క ప్రాంతంలో తన మార్కును వేసుకుంటూ ముందుకు వెళ్లిన నాయకుడు వైయస్‌ఆర్‌. తండ్రి ఒక్క అడుగు వేస్తే తాను రెండు అడుగుల ముందుకేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. తన తండ్రిలాగే మార్కును వేసుకొని ప్రతి ప్రాంతం బాగుండాలని ముందుకు వెళ్తున్నారు. 

రెండ్రోజుల క్రితం ప్రకాశం జిల్లా శాసనసభ్యుల చేత చంద్రబాబు లేఖ రాయించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఆపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమానికి తెరలేపారు. ప్రకాశం, గుంటూరు ప్రాంతాలకు వైయస్‌ఆర్‌ ఏం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏం చేస్తున్నారు. చంద్రబాబు ఏం చేశారో చూసుకుంటే.. వైయస్‌ఆర్‌ సీఎం అయిన తరువాతే ఎన్‌ఎస్‌పీ మోడనైజేషన్‌ను టేకప్‌ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు తీసుకొచ్చారు. గుండ్లకమ్మ రిజర్వాయర్, రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి పూర్తిచేశారు. కొర్సిపాడు లిఫ్ట్, సోమశిల నుంచి రాళ్లపాడుకు కెపాసిటీని పెంచడం అనేక ప్రాజెక్టులను వైయస్‌ఆర్‌ తీసుకువచ్చారు. 

చంద్రబాబు ఏం చేశాడు.. ప్రకాశం, గుంటూరు ప్రాంతాలకు, వెలిగొండ, 2008 నుంచి 2014 వరకు వైయస్‌ఆర్, ఆ ప్రభుత్వం పదకొండున్నర కిలోమీటర్లు చేస్తే.. చంద్రబాబు 5 సంవత్సరాల్లో చేసింది కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరంలోనే మొదటి టన్నల్‌ను 2.8 కిలోమీటర్లు పూర్తిచేసింది. ఇదే కాకుండా రెండో టన్నల్‌కు సంబంధించి కేవలం 2 కిలోమీటర్లు పూర్తిచేశారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కిలోమీటర్‌కు పైగా పనులు పూర్తిచేశాం. రెండో టన్నల్‌ను కూడా 2023లోగా పూర్తిచేసి.. రెండు టన్నల్‌ నుంచి నీరు అందిస్తాం. 

ఇదే కాకుండా ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రణాళిక బద్ధంగా వెళ్తున్నారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం ప్రాంతాలకు సంబంధించి పల్నాడు డ్రాట్‌ మిటిగేషన్‌ స్కీమ్‌ అని ఎన్నికలకు మూడు నెలల ముందు శిలాఫలకాలు వేశారు. సీఎం వైయస్‌ జగన్‌ వచ్చాక గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి ఎన్‌ఎస్‌పీ కెనాల్‌కు వేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశాం. దాన్ని కూడా పూర్తిచేసి నాగార్జున సాగర్‌ కింద ఉన్న ఆయకట్టును ఆదుకునే కార్యక్రమం సీఎం వైయస్‌ జగన్‌ చేస్తారు. 

అన్ని ప్రాంతాలు బాగుండాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తుంటే.. అన్ని ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం చంద్రబాబుది. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలే.. టీడీపీ ఎమ్మెల్యేల నోటి నుంచి వస్తున్నాయ్‌. గత ఐదు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులు తీసుకుంటే.. పాలమూరు రంగారెడ్డి 2015, దిండి 2015లో, తుమ్మిళ్ల 2015లో కట్టారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న తరువాత ఇవన్నీ ప్రారంభించి.. వారితో చంద్రబాబు రాజీపడిన మాట వాస్తవం కాదా..? ఆరోజే చంద్రబాబు.. రాయలసీమ లిఫ్ట్‌కు ఆలోచన చేసి ఉంటే ఈరోజు ఈ ప్రాంతం ఇబ్బందులుపడే అవసరం ఉండేది కాదు. ఒకప్పుడు పోతిరెడ్డిపాడులోంచి నీరు తీసుకెళ్తుంటే.. దేవినేని ఉమతో ప్రకాశం బ్యారేజీ దగ్గర ధర్నా చేయించాడు. ఎప్పుడూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం తప్ప.. చేసిందేమీ లేదు. 

చిత్తూరు రాష్ట్రంలోనే పెద్ద రిజర్వాయర్‌ లేని జిల్లా. ఆ జిల్లాలో మూడు రిజర్వాయర్లు కట్టి.. 8 నుంచి 10 టీఎంసీల నీరు నింపాలని సీఎం ఆలోచిస్తే.. అక్కడ తన వర్గంతో ఎన్‌జీటీకి వెళ్లి కేసు వేయించిన దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు.  పుట్టిన జిల్లా, రాజకీయ బిక్ష పెట్టిన జిల్లాలో మూడు రిజర్వాయర్లు కడుతుంటే.. తన ఉనికి ఎక్కడ పోతుందోనని, మనసు ఒప్పక కేసు వేయించాడు. 

లేటరైట్‌ను బాక్సైట్‌ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒక్క లేటరైట్‌కు పర్మిషన్‌ ఇవ్వలేదు. కేవలం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అనుమతిచ్చారు. 2015లో పర్యావరణ అనుమతులు ఇచ్చింది నీ ప్రభుత్వం కాదా..? 2018లో కోర్టు ఆర్డర్‌ ఇచ్చినప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయావ్‌..? గిరిజనుల పేరు మీద 3 మైన్‌లు తీసుకొని దాన్ని నడిపిన వ్యక్తులు అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు కాదా..? వారి మీద విచారణ చేపట్టాలని రాసే దమ్మూ, ధైర్యం పత్రికలు, టీవీలకు లేదా..? 

ఏ ప్రాంతంలోనైనా తన మార్కును వేసుకున్న వ్యక్తి వైయస్‌ఆర్‌. అదే విధంగా తన బిడ్డ వైయస్‌ జగన్‌ ప్రతి ప్రాంతం బాగుండాలని, ప్రతి ఒక్కరూ బాగుండాలని, హక్కు కలిగిన నీళ్లలోనే ప్రాజెక్టులు కట్టుకుంటూ ముందుకెళ్తుంటే.. దానికి సహకరించాల్సిందిపోయి.. చిచ్చుపెట్టే ఒక ప్రయత్నం చేస్తున్న నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి వ్యక్తి మనిషేనా..?’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు.

 

తాజా వీడియోలు

Back to Top