‘జగనన్న అమ్మఒడి’ ప్రతిష్టాత్మకంగా అమలు

9న చిత్తూరులో సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేస్తాం

సుమారు 43 లక్షల మంది తల్లులకు రూ.6400 కోట్ల నగదు అందిస్తున్నాం

పథకం పరిధిలోకి రాలేని వారి వివరాలను పరిశీలిస్తున్నాం

అర్హులైన వారందరికీ అమ్మఒడి పథకం వర్తింపజేస్తాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: అమ్మఒడి పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు జగనన్న ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అమ్మఒడి పథకంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు. జగనన్న అమ్మ ఒడి అనే పథకం ద్వారా పిల్లలను బడికి పంపించే తల్లులకు ప్రతి ఒక్కరికీ ఏటా రూ. 15 వేలు ఆర్థికసాయం చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా  ఈ నెల 9వ తేదీన చిత్తూరులో అమ్మఒడి పథకం ప్రారంభమవుతుందన్నారు. సుమారు 43 లక్షల మంది తల్లులకు రూ.6400 కోట్ల నగదు సాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదరికంతో విద్యార్థులు విద్యకు దూరమవుతున్న నేపథ్యంలో వారి తల్లులకు చేయూతను ఇవ్వాలని ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

అమ్మఒడి పథకంలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి చిన్న అంశాన్ని కూడా సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారని విద్యాశాఖ మంత్రి సురేష్‌ చెప్పారు. అనాథ పిల్లలు, పట్టణాల్లోని కొంతమంది పిల్లల అడ్రస్‌లు లభించకపోవడం, కరెంటు బిల్లులు 300 యూనిట్లు లోపల ఉన్నవారు చాలా మంది కొన్ని కారణాల వల్ల పథకం పరిధిలోకి రాలేకపోతున్నారని గుర్తించడం జరిగిందన్నారు. అమ్మఒడి పథకం కిందకు ఎందుకు రాలేకపోతున్నారని అన్వేషించగా.. కుల వృత్తులు చేసేవారు.. లాండ్రీస్, కార్పెంటర్, సెలూన్‌ షాపుల కరెంటు బిల్లులు, ఇంటి బిల్లులకు అనుసంధానంతో ఉన్నవి కొన్ని అయితే.. మరికొన్ని ఉమ్మడి కుటుంబంలో ఉన్న నేపథ్యంలో కరెంటు బిల్లులు 300 యూనిట్లు దాటిపోవడం లేదా బిల్లు సకాలంలో చెల్లించకపోవడం వల్ల 300 యూనిట్ల పరిధి దాటిపోవడం ఇలాంటి అనేక అంశాలను గుర్తించడం జరిగిందన్నారు. దీనికి 6 నెలల వివరాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించిన తరువాత పథకం వర్తింపజేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మఒడి పథకం అందజేస్తామని విద్యాశాఖ మంత్రి సురేష్‌ చెప్పారు.

Back to Top