రాజ్యాంగ ఉల్లంఘనకే లోకేష్‌కు ఐటీ శాఖ

ఐటీ గ్రిడ్‌ ద్వారా ఓటర్ల వ్యక్తిగత విషయాలు లీక్‌

వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ‘పచ్చ’ కుట్ర

రెండు రాష్ట్రాల మధ్య యుద్ధవాతావరణం ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్న బాబు

దీనిపై ఈసీ స్పందించి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మహ్మద్‌ ఇక్బాల్‌

హైదరాబాద్‌: రాజ్యాంగ ఉల్లంఘన చర్యల కోసమే లోకేష్‌ను చంద్రబాబు ఐటీ శాఖ మంత్రిని చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మహ్మద్‌ ఇక్బాల్‌ ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం మాని గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల డేటాను లోకేష్‌ ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై గెలుపు సాధించలేమని తెలిసి ప్రజాస్వామ్య విలువలను కాలరాసి ఐటీ గ్రిడ్‌ కంపెనీకి ఓటర్‌ లిస్టును లీక్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎలక్షన్‌ కమిషన్‌ స్పందించి తెలుగుదేశం పార్టీ గుర్తంపును రద్దు చేయాలని ఇక్బాల్‌ కోరారు. లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహ్మద్‌ ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోప్యంగా ఉంచాల్సిన ఓటరు జాబితాను, ఆధార్‌ కార్డు డాటా, వ్యక్తిగత వివరాలను లీక్‌ చేసే హక్కు ఎవరు కల్పించారని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్‌ కంపెనీ ద్వారా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై వైయస్‌ఆర్‌ సీపీ నేత లోకేశ్వర్‌రెడ్డి సైబరాబాద్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు వెంటనే ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై సోదాలు జరపడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారన్నారు. 

తెలుగుదేశం పార్టీ కుట్రలపై ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టిసారించాలని ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్నారు. గవర్నర్, టెలికాం రెగ్యులేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా దృష్టిసారించాలన్నారు. ఇలాంటి అక్రమ చర్యలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. చట్టపరంగా ఆధారు కార్డు, వ్యక్తిగత విషయాల లీకేజీ సెక్షన్‌ 379, సెక్షన్‌ 66 కిందకు వస్తుందన్నారు. దీనిపై సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు చట్టాలంటే గౌరవం లేదని, ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయి వచ్చి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి కేసును నీరుగార్చే కుట్ర చేశాడన్నారు. ఈ విషయంపై కూడా ప్రజలను తప్పుదోవపట్టించడానికి తమ వాళ్లు ఐదుగురు కనిపించడం లేదంటూ మరో డ్రామా ఆడుతున్నాడన్నారు. 

Back to Top