సామాజిక న్యాయానికి ప్రతిరూపం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

ప్రభుత్వ సలహాదారు(సోషల్ జస్టిస్)  జూపూడి ప్రభాకరరావు 

 ఎస్సీ, ఎస్టీలంటే బాబుకు ఎప్పుడూ చులకనే.. అందుకే డీజీపీ సవాంగ్ పై విమర్శలు

 సీపీగా ఉన్నప్పుడు సవాంగ్ ను ప్రశంసించి.. డీజీపీగా వస్తే విమర్శిస్తారా..?

 బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా మీపై తిరుగుబాటు చేస్తే.. మట్టి కొట్టుకుపోతారు

 బడుగు, బలహీనవర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తోన్న మంచిని చూసి ఓర్వలేకే టీడీపీ ఫ్యూడల్ శక్తులు విమర్శలు

విశాఖ‌: రాజకీయాల్లో విశ్వసనీయతకు, సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు నిలుస్తున్నారని ప్రభుత్వ సలహాదారు(సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. బడుగు, బలహీన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకువెళ్లడమే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ గారి లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రివర్గ కూర్పు మొదలు నామినేటెడ్‌ పదవుల వరకూ అన్ని వర్గాలకు సమ న్యాయం చేసిన నాయకుడు వైయ‌స్ జగన్‌ అని అన్నారు. అయితే వీటిని చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్యూడల్‌ శక్తులు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని జూపూడి మండిపడ్డారు. 

విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో జూపూడి మాట్లాడుతూ..  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌కు మతి భ్రమించిందని అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బడుగు, బలహీనవర్గాలను చంద్రబాబు ఎప్పుడూ చులకనగానే చూశారని ఈ సందర్భంగా జూపూడి గుర్తు చేశారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మీరు... ఆయన సీపీగా ఉన‍్నప్పుడు ప్రశంసించిన విషయం గుర్తులేదా అని అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్‌ అధికారిని రాజీనామా చేసి వెళ్లిపోవాలి అంటూ మాట్లాడటం సరైనదేనా? అని జూపూడి ప్రశ్నలు సంధించారు. ఈ విషయాన్ని టీడీపీలోని ఎస్సీ, ఎస్టీ సోదరులు కూడా గమనించాలని కోరారు. 

 2019 ఎన్నికల నుంచి వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ కూర్పు మొదలు నిన్నటి 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ప్రకటించిన ప్రస్థానం వరకూ బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.  చైర్మన్‌ పోస్టులు, నామినేటెడ్‌ పోస్టులు వీటన్నింటిలో జగన్‌గారు సామాజిక న్యాయం పాటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు 80 శాతానికి పైగా ప్రాతినిథ్యం కల్పించడమే కాకుండా 52శాతం మహిళలకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా నిలిచారు. దీనిపై అవగాహన లేనివారే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా చేసేందుకు టీడీపీ ప్రతిరోజు విషం కుమ్మరిస్తోంది. 
- టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిందో అందరూ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మంత్రివర్గ కూర్పులోకానీ,  కార్పొరేషన్‌, చైర్మన్లు, నామినేటెడ్‌ పోస్టుల విషయంలో కానీ.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిగారు కల్పిస్తున్న సామాజిక న్యాయాన్ని గతంలో 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు కల్పించలేకపోయారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. 

రాష్ట్ర డీజీపీ మీద అర్ధం పర్థం లేని విమర్శలు చేయడం లోకేష్‌కు, చంద్రబాబుకు, ఆయన బృందానికి ఒక ఫ్యాషన్‌గా మారింది.   రాష్ట్ర డీజీపీ ఒక షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌కు చెందిన వ్యక్తి అనే చులకనభావం మీలో బాగా కనిపిస్తుంది.  మీ కులం వారంతా గొప్పవారని, ఇతర కులాల వారంతా తక్కువ వారని... ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అని మీరు బలంగా నమ్ముతున్నారు కాబట్టే మీ కుల దురహంకారమే డీజీపీ సహా ఎవరినైనా ఎంత మాట అయినా అనడానికి కారణం అవుతోంది.  విజయవాడ సీపీగా ఉన్నప్పుడు గౌతమ్‌ సవాంగ్‌ ఏంటో మీకు తెలియదా?. ఆరోజు టీడీపీ ప్రభుత్వంలో మంచివాడు.. ఈరోజు కాదా..?
– నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా, కుల పిచ్చి తగ్గించుకోవాల్సిందిగా చంద్రబాబునాయుడుకు, ఆయన కొడుక్కి సలహా ఇస్తున్నాం.  మీ సామాజిక వర్గం వ్యక్తిని ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా పెట్టి మీరు చేసిన అరాచకాలు ఒకటా, రెండా.. మీకు తెలిసిన సామాజిక న్యాయం అది.
– ఇక చింతమనేనిని బయటకు తీసుకువచ్చి నిన్న ఏవేవో మొరిగించారు. చింతమనేని ఒక గూండా. ఒక రౌడీ. స్త్రీలపై అఘాయిత్యాలు చేసే ఒక రాక్షసుడు. అలాంటి వాడిని సమర్థిస్తున్న మీ పార్టీని రావణాసురుడికి, దుర్యోధనుడికి పుట్టిన పార్టీగా భావించాల్సి వస్తుంది.

ఇవాళ దేశమంతా వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పాలనను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటుంటే... ఇక్కడ జరుగుతున్న సామాజిక న్యాయాన్ని ఏమాత్రం జరగనట్లు ప్రతిరోజు ప్రభుత్వంపై విషం కుమ్మరిస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో భాగమైన కొంతమంది మా దళిత సోదరులు కూడా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారు ఒక ఎస్టీ అధికారి అయిన గౌతమ్‌ సవాంగ్‌గారిని అ‍త్యున్నతమైన డీజీపీ పోస్ట్‌లోకి తీసుకున్నారు. అలాంటి ఆయనను రాజీనామా చేయాలంటూ మాట్లాడటం సరైన పద్ధతేనా? చంద్రబాబు, లోకేష్‌కంటే మతి పోయింది. మరి ఆ పార్టీలో ఉన్న దళితులకు చంద్రబాబు హయాంలో ఏం న్యాయం జరిగిందో చెప్పాలి?

 రాష్ట్రంలో దిశ చట్టం ఉన్నదా అని అడుగుతున్నారు. దిశ బిల్లు రెండు సభల ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం కోసం చూస్తోంది. అది ఈరోజు కాకపోతే రేపు అమల్లోకి వస్తుంది.  దిశ బిల్లును తెలుగుదేశం పార్టీ ఎందుకు సమర్థించలేదో టీడీపీ వాళ్లు సమాధానం చెప్పాలి.
– మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలకు ఒడి గట్టిన వారికి ఎట్టి పరిస్థితుల్లో వారంలోగా శిక్ష పడకూడదన్నది, అసలు శిక్షే పడకూడదన్నది చంద్రబాబు, లోకేష్‌ విధానమా..?
– ఈ విషయంలో వ్యక్తిగత అంశాలు ఏవైనా వారిద్దరిని, వర్ల రామయ్యను భయపెడుతున్నాయా..?  గత చరిత్ర లోకేష్‌ను వెంటాడుతోందా. లేకపోతే దిశ బిల్లును, దిశ చట్టాన్ని, దిశ పోలీస్‌ స్టేషన్లను లోకేష్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు..?
– సిగ్గు పడాల్సింది రాష్ట్ర డీజీపీనా. లేక వారం రోజుల్లోగా శిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ వారా..?

 ముఖ్యమంత్రిగారు సవాంగ్‌కు డీజీపీ పదవి ఇచ్చి, ఒక ఎస్టీ అధికారికి గౌరవం ఇస్తుంటే.. ఆ అధికారిని పట్టుకుని ఇలా మాట్లాడుతుంటే.. ఇక టీడీపీ నేతలకు సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాల భద్రత గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది..? దళితులు అనుభవించాల్సిన పదవులను ఎవరో వచ్చి ఏలేసి వెళ్ళిపోతే ... 80శాతం పేద వర్గాలకు అవకాశం కల్పిస్తున్న జగన్‌గారిని విమర్శిస్తారా? 
- అదే టీడీపీ హయాంలో ఏం సాధించారు గుండు సున్నా. సామాజిక న్యాయం అమలు అవుతున్నది వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే. రాజకీయ పదవుల్లోకి ఈరోజు అనేకమైన వర్గాలను తీసుకువచ్చిన ఘనత వైయ‌స్‌ జగన్‌ గారిదే.

లోకేష్‌ మాట్లాడేది ఏమైనా అర్థం అవుతుందా? ఒక ఎస్టీ అధికారిని రాజీనామా చేసి వెళ్లిపోవాలి అంటూ మాట్లాడటం సరైనదేనా? రాజ్యాంగం ప్రకారం వెళితే.. ఎస్టీ అధికారిని డీజీపీని కాకుండా చేసిన దరిద్రమైన చరిత్ర ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిదే. ఎస్సీ, ఎస్టీ వ్యక్తులు అత్యున్నతమైన స్థాయిలో కూర్చుంటే టీడీపీ శక్తులు వికృతమైన చర్చలకు పాల్పడుతున్నాయి. 

రాజకీయ పదవుల్లోనే కాకుండా ప్రభుత్వం నుంచి అట్టడుగు వర్గాలకు ఆర్థిక సాయం అందింది కూడా వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. డీబీటీ ద్వారా బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వర్గాల ఖాతాల్లోకి నేరుగా ఒక లక్షా 4వేల,200 కోట్ల రూపాయలను జమ చేశారు. ఇంత భారీ ఎత్తున ఇన్ని లక్షలమంది లబ్ధిదారులు మరే ప్రభుత్వంలోనైనా ఉన్నారా?. ఇంత మంచి చేస్తున్న వైయ‌స్ జగన్‌గారి ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం మీకు ఎలా వచ్చింది. 

మీ హయాంలో కాంట్రాక్టర్లకు, దోపిడీదారులకు, మీకు కావాల్సిన మీడియాలకు, కొంతమంది వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాయి. మీ ప్రభుత్వ హయాంలో పట్టుమని పదిమందికే మీరు పని చేశారు. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా మీపై తిరుగుబాటు చేస్తే.. మీరు మట్టి కొట్టుకుపోతారు, ఈవిషయాన్ని గుర్తుపెట్టుకోండి. సామాజిక న్యాయం మీద చర్చపెట్టి మాట్లాడాల్సి వస్తే తలవంచుకుని కూర్చోవాల్సి వచ్చేది టీడీపీ గుంట నక్కలే. మీ ప్రభుత్వ హయంలో ఎవరికి పదవులు ఇచ్చారో చెప్పగలరా?

 ప్రభుత్వంతో పాటు, పోలీసులు, అధికారుల మీద రోజూ విమర్శించుకుంటూ వెళ్లడమే టీడీపీ పనా? దిశ చట్టం మీద మీకు అవగాహన లేకపోతే నేర్చుకోండి.  రమ్యశ్రీ హత్య కేసులో ప్రభుత్వం సత్వరమే స్పందించిందని జాతీయ ఎస్సీ కమిషన్‌ కూడా ప్రశంసించింది. ఏ కార్యక్రమం లేకపోతే టీడీపీ బెంబేలు ఎత్తిపోతూ ఎవరరో ఒకరి మీద విమర్శలు చేస్తూ, డీజీపీ నుంచి ముఖ్యమంత్రి వరకూ బట్టకాల్చి వేయడానికి ప్రయత్నాలు చేస్తోంద‌ని ప్రభుత్వ సలహాదారు(సోషల్ జస్టిస్)  జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు..
 

Back to Top