నెల్లూరు: వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన భూములకు సర్వహక్కులు కల్పించేలా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. పేదవాడికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమస్యలకు పరిష్కారం చూపించామని పేర్కొన్నారు. చుక్కల భూముల సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుని, ఎలాంటి అడ్డంకులు లేని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించామని, దీంతో రైతులకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. జగన్కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రీ-వెరిఫికేషన్ పేరుతో 27 నెలలుగా కాలయాపన చేసిందని కాకాణి పేర్కొన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వల్ల పేదలు, రైతులకు ప్రయోజనం కలిగిందని, అయితే ఆ క్రెడిట్ను కూడా చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.