సీఎం జగన్‌కు ఇంటర్‌ విద్యార్థుల కృతజ్ఞతలు 

అమ‌రావ‌తిః ‘అమ్మఒడి’  పథకాన్ని ఇంటర్మీడియట్‌కు కూడా వర్తింపజేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం శాససభ ఆవరణలో సీఎంను కలిసి హర్షం వ్యక్తం చేశారు.  అమ్మఒడి పథకం సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని,  అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. పేదరికం కారణంగా బాలికలను పదవ తరగతి పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్ళకుండా నిలిపివేస్తున్న తల్లిదండ్రులకు ఈ పథకం అండగా నిలుస్తోందని, బాలికలు సైతం ఉన్నత విద్య చదువుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అమ్మఒడి పథకం.. తల్లులకు బంగారు ఒడిగా.. పిల్లలకు చదువుల తల్లిగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ‘ధన్యవాదాలు సీఎం సార్‌’  అంటూ ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ‘మా మంచి ముఖ్యమంత్రి’ అంటూ నగర వీధుల్లో కదం తొక్కారు.

Back to Top