ఇలాంటి సంఘటనలు  ప్రభుత్వం ఉపేక్షించదు

హోంమంత్రి తానేటి వనిత
 

 విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన హేయనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. నిందితులను ఉరి తీయడం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు. బాధితురాలికి ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, యువతి చేస్తానంటే ఉద్యోగం కూడా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు సూచించామని హోంమంత్రి పేర్కొన్నారు.

యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారని తానేటి వనిత తెలిపారు. పెస్టిసైడ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించామని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు మానసికంగా బాధపడుతున్న యువతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఒంగోలు పర్యటన దృష్టి మరల్చేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు.

Back to Top