విజయవాడ: వంశపారంపర్య అర్చకత్వంపై జారీ చేసిన జీవో 439 నేడు కార్యరూపం దాల్చింది. ఈ ఉత్తర్హులను అనుసరించి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం వల్లిపాడు గ్రామానికి చెందిన మధనగోపాలస్వామి ఆలయ అర్చకుడిగా తిరిగి నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సవరించి అమల్లోకి తెచ్చారని మంత్రి పేర్కొన్నారు.
అధికారంలోకి రాగానే సీఎం వైయస్ జగన్ బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించేందుకు జీవోను సవరించారని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం వైయస్ జగన్ ఆదేశించారన్నారు. అందులో భాగంగా అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు.