రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని కోర్టు చెప్పలేదు

 మంత్రి అమర్నాథ్‌
 

విశాఖపట్నం: ఈనెల 9న పాడేరులో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి- పరిపాలన వికేంద్రీకరణ అంశంపై సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. జేఏసీ ద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు

రైతుల పేరిట జరుగుతున్న యాత్రపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. ప్రజల ఆకాంక్షకు భిన్నంగా అమరావతి యాత్ర జరుగుతోందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రజలు వికేందీకరణకు వ్యతిరేకిస్తున్నారన్నారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు చేస్తున్న కుట్రే ఈ యాత్ర అని దుయ్యబట్టారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని కోర్టు చెప్పలేదని స్పష్టం చేశారు.

యాత్రలో చెప్పులు చూపించడం, తొడలు కొట్టడం లాంటి పనులు చేయమని చెప్పలేదని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి శాంతి భద్రతలు కాపాడాలని ఉన్నా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. 29 గ్రామాల కోసం అశాంతి సృష్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 29 గ్రామాల కోసం 26 గ్రామాల కోసం 26 జిల్లాలు విడిచిపెట్టాలని కోరడం అన్యాయమన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాదయాత్ర విరమించాలని మరోసారి కోరుతున్నట్లు పేర్కొన్నారు.
 

Back to Top