తాడేపల్లి: రాష్ట్రంలో మానవత్వంకు మచ్చతెచ్చేలా కూటమి సర్కార్ దళిత, మైనార్టీలపై రాజ్యహింసకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పాలన ముసుగులో రాక్షస పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ సృష్టించిన రెడ్బుక్ రాజ్యాంగం బూటుకాలు కింద బడుగులు విలవిలలాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ హింసాకాండలో బాధితుల గొంతుగా వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. తెనాలిలో పోలీసుల హింసకు గురైన బాధిత యువకులను మాజీ సీఎం వైయస్ జగన్ పరామర్శించి, వారి పక్షనా ఈ దుర్మార్గంపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ఏడాది పాలనలోనే ఈ ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. తెనాలిలో ముగ్గురు దళిత, మైనార్టీ యువకులపై పోలీసులు ఇటీవల జరిపిన హింసను రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆ సంఘటనపై రాష్ట్ర హొంశాఖ మంత్రి కొద్దిపాటి పశ్చాత్తాపం కూడా లేకుండా పోలీసులను వెనుకేసుకురావడం, దళిత, మైనార్టీ వర్గాలను తమ బూటుకాలి కింద పోలీసులు నలిపేస్తారని, దానికి తాము అండగా ఉంటామనే సంకేతాలను ఇవ్వడం అత్యంత దారుణం. బర్త్డే పార్టీకి వెళ్ళిన తెనాలికి చెందిన ఈ ముగ్గురు యువకులను పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేశారంటూ ఒక తప్పుడు కేసును నమోదు చేసి, నడిరోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగా లాఠీలతో చావబాదారు. దెబ్బలకు తట్టుకోలేక రోదిస్తున్న ఆ యువకుల ఆక్రందనలను చూసి ఉన్మాదంతో ఊగిపోయిన పోలీసుల దాష్టీకాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వీరిని అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ఇదిగో ఆధారాలు, ఇదిగో వీరు చేసిన నేరం అని ఇప్పటి వరకు పోలీసులు చూపించలేకపోయారు. ఈ రోజు రాష్ట్రంలో అన్నిచోట్లా సీసీటీవీ కెమేరాలు ఉన్నాయి. నిజంగా వారు కానిస్టేబుల్పై దాడి చేసి ఉంటే, దానికి సంబంధించి ఎక్కడో ఒకచోట అయినా సీసీ టీవీ ఫుటేజీ లభించి ఉండేది కాదా? కేవలం ఆరోపణలు చేయడం మినహా ఒక్క ఆధారం కూడా పోలీసుల వద్ద లేదంటే, ఇది బనాయించిన కేసేనని ఎవరికైనా అర్థమవుతుంది. చేయని నేరానికి ముగ్గురు యువకులను ఒక సీఐ లాఠీలతో కొట్టి అలసిపోతే, మరో సీఐ లాఠీ అడ్డుకుని ఆ హింసాకాండను కొనసాగించారు. దళిత, మైనార్టీలను చిత్రహింసలు పెట్టడానికే చంద్రబాబు, లోకేష్లు అధికారంలోకి వచ్చారా? వైయస్ఆర్సీపీకి అండగా ఉన్న వర్గాలను అణిచివేయాలనే కుట్ర గత ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి అండగా ఉన్న కులాలను అణిచివేయాలన్నదే చంద్రబాబు కుట్ర. అందులో భాగంగానే దళిత, మైనార్టీ వర్గాలను బూటుకాలుతో తొక్కుతూ, లాఠీలతో హింసించారు. ఏడాది కాలంలో ఇటువంటి ఘటనలే తప్ప, చెప్పడానికి ఈ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా లేదు. వైయస్ఆర్సీపీ నాయకులు నందిగం సురేష్, మేరుగు నాగార్జున, ఆదిమూలం సురేష్, మొండితోక అరుణ్కుమార్ ఇలా దళిత వర్గాలను భయపెట్టడానికి తప్పుడు కేసులు పెడుతూ పోతున్నారు. ఇటువంటి కేసులకు భయపడేవారు ఎవరూ వైయస్ఆర్ కాంగ్రెస్లో లేరు. చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియాకు తెనాలి అయితానగర్లో దళిత, మైనార్టీలను దారుణంగా కొడితే కనీసం దానిపై సీఎంను ప్రశ్నించలేక పోతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో దళితులను బహిష్కరిస్తే కనీసం ప్రశ్నించలేకపోయారు. జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిలో ముగ్గురు దళిత, మైనార్టీలను పోలీసులు హింసిస్తే దాని గురించి కనీసం డిప్యూటీ సీఎం పవన్ వాకబు కూడా చేయలేదు. తన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ను వివరణ ఎందుకు కోరలేదు. తప్పుడు కేసులు పెట్టి తప్పు కప్పిపుచ్చుకునే యత్నం దళిత, మైనార్టీ యువకులపై గంజాయి సేవించారని కేసులు పెట్టారు. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను ఎందుకు బయటపెట్టలేదు. పోలీసులు చెబుతున్న ప్రకారం ఈ ముగ్గురు యువకులు కానిస్టేబుల్ను కొట్టి ఉంటే, వారిని అరెస్ట్ చేసి, కోర్ట్కు హాజరుపరచాలి, న్యాయస్థానాల ద్వారా వారికి శిక్షపడేలా చేయాలి. అంతేకానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, దండించే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? లంచం కోసం ఆ యువకుల స్నేహితుడిని కానిస్టేబుల్ వేధించడంతో వారు అతడిని హెచ్చరించారనే కారణంతో ఇలా తప్పుడు కేసు పెడతారా? ఈ ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం, హోమంత్రి, స్థానిక మంత్రి నాదెండ్ల మనోహర్లు నోరు మెదపడం లేదు. దళిత సమాజం నుంచి వచ్చిన హోమంత్రి కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారనడం సిగ్గుచేటు. ఆ యువకులు దళిత, మైనార్టీ కులాల్లో పుట్టిన మాట వాస్తవం కాదా? వారిపై ఇటువంటి రాక్షసత్వం చేస్తే, దానిపై స్పందించడానికి బదులు సమర్థిస్తారా? వైయస్ జగన్ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటారు, బాధితుల పక్షాన మాట్లాడతారు. హోమంత్రి అంటే తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధి కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. దుర్మర్గంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టం దళిత, మైనార్టీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ఘటనలో బాధ్యులైన పోలీసులను వదిలిపెట్టం. పైగా గంజాయి మత్తులో ఉన్నరంటూ అభాండాలు వేస్తున్నారు. ఈ కేసు బయటకు రాగానే వారిపై రౌడీషీట్ను తెరిచారా? గతంలోనే ఉన్నాయా అనే వాస్తవాలను బయటపెట్టండి. వైయస్ జగన్ ప్రారంభించిన సామాజిక న్యాయమనే సంస్కరణల నుంచే అనితకు హోమంత్రి పదవి వచ్చిందని గమనించాలి. హోంమంత్రిగా ఉండి కనీసం ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ స్థాయి వారిని అయినా బదిలీ చేయగలరా? కనీసం పోలీసులపై కోప్పడే స్థాయిలో ఉన్నారా? దళిత, మైనార్టీ యువకును హింసిస్తుంటే కనీసం హోమంత్రి అనితకు బాధగా కూడా అనిపించలేదు. ఆ యువకుల తల్లులు కారుస్తున్న కన్నీరు కూడా ఆమెకు కనిపించకపోవడం బాధాకరం. ఇటువంటి సంఘటనలను వైయస్ఆర్సీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదు. బాధిత యువకులను, వారి కుటుంబాలను మాజీ సీఎం వైయస్ జగన్ పరామర్శిస్తారు. వారి పట్ల జరిగిన అమానుషత్వాన్ని ప్రశ్నించే తీరుతారు.