పంచదారల కొండలను కొల్లగొడుతున్న టీడీపీ నేతలు

రూ.1,000 కోట్ల అక్రమ మైనింగ్‌ దోపిడీ.. 

32 కిలోమీటర్ల ప్రాంతాన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించాలి

మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్‌

ఢిల్లీ: పంచదారలలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు కొండలను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారని, పంచదారలలో అక్రమ మైనింగ్‌తో రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దోపిడీకి సీఎం రమేష్ బాధ్యత వహించాలని, 32 కిలోమీటర్ల మేర ఉన్న పంచదారల కొండలను నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించాలని కోరారు.

పాండవులు నడయాడిన పవిత్ర ప్రాంతంలో అక్రమ మైనింగ్‌

పాండవులు నడయాడిన పంచదారల ప్రాంతాన్ని స్థానిక ప్రజలు భక్తితో పూజిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఐదు దారలు రాకుండా ఇష్టారాజ్యంగా మైనింగ్‌ చేస్తున్నారు. సీఎం రమేష్‌, ఆయన మేనల్లుడు దౌర్జన్యంగా మైనింగ్‌ కొనసాగిస్తున్నారు. అడ్డుకునే వారిని లారీలతో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ, మైనింగ్‌ పెద్దలపై చర్యలు తీసుకోవడం లేదు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఎంపీ సీఎం రమేష్‌ దీనిపై స్పందించాలి.

కేంద్ర బృందాన్ని పంపుతామని హామీ

పంచదారల మైనింగ్‌ను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపుతామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ హామీ ఇచ్చారు. 32 కిలోమీటర్ల పంచదారల ప్రాంతాన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించి, అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ప్రజల విశ్వాసానికి, పంచదారల సహజ సంపదకు రక్షణ కల్పించాలి.
 

Back to Top