తాడేపల్లి: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమం, కక్ష పూరితం అని, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు, నిజాయితీగా పని చేసే జర్నలిస్టును వేధించడం దారుణమని వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలతో ‘సాక్షి’కి ఏంటి సంబంధం అన్న ఆయన, వైయస్ జగన్ను, ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..: డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కొమ్మినేని అరెస్ట్: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈనెల 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఓర్వలేక అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జరిగింది. మీడియా ఛానళ్ల అండ చూసుకుని సాధారణ విషయాలను నేరాలుగా చూపించి వైయస్సార్సీపీ మీద బురద జల్లాలనే తాపత్రయం అడుగడుగునా కనిపిస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావుకి జర్నలిస్టుగా అపారమైన అనుభవం ఉంది. అంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి తప్పు చేశాడని నిందించడం దారుణం. గతంలో ఆయన ఎన్టీవీలో పని చేస్తున్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం లేదనే కారణంతో ఛానల్ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి, ఆ షోను ఆపివేయించారు. ఉద్యోగం నుంచి కూడా తీసేయించారు. ఇప్పుడు ఏకంగా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారు. ‘సాక్షి’కి ఏంటి సంబంధం?: నిజాయితీగా పని చేస్తున్న వ్యక్తి కాబట్టే కొమ్మినేని మీద సీఎం చంద్రబాబు కక్ష కట్టారు. ‘మా సామాజికవర్గం అయి ఉండి మమ్మల్నే విమర్శిస్తావా?’ అనేది ఆయనపై చంద్రబాబు ఆగ్రహానికి కారణం. కాబట్టే ఆయన మీద బట్ట కాల్చి మీద పడేశారు. 70 ఏళ్ల వయసున్న వ్యక్తితో వ్యవహరించేది ఇలాగేనా? దానికితోడు అన్ని మీడియా ఛానెళ్లను మేనేజ్ చేసేసిన చంద్రబాబుకి, సాక్షిని మేనేజ్ చేయలేడు కాబట్టి కక్షగట్టి ఈ విధంగా పగ తీర్చుకుంటున్నాడు. కొమ్మినేనికి బెయిల్ రాకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. గతంలో కొన్ని ఛానళ్ల లైవ్ షో ల్లో బూతులు తిట్టుకున్నారు. ఒక ఛానల్లో డిస్కషన్లో పాల్గొన్న ఒక పార్టీ నాయకుడిని మరో పార్టీ నాయకుడు చెప్పుతో కొట్టాడు. ఒక ఛానెల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు ఏదైనా మాట్లాడితే దానికి ఛానల్ యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేయడం ఏంటి? ఏబీయన్, టీవీ5లలో మమ్మల్ని దారుణంగా తిడుతున్నారు. అంటే మాట్లాడే స్వేచ్ఛ, హక్కు కేవలం అధికార పక్షం వారికే ఉంటుందా? విపక్షమైన మా పార్టీకి ఉండదా?. ఇదేనా ప్రజాస్వామ్యం. అసలు జర్నలిస్టులు, విశ్లేషకులు వ్యక్తం చేసే అభిప్రాయాలకు మీడియా సంస్థను నిందించడం ఎంత వరకు సబబు?. చంద్రబాబు దిగజారుడుతనం: ఛానల్లో తన మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే, అందుకు క్షమాపణ కోరుతున్నానని జర్నలిస్ట్ కృష్ణంరాజు స్వయంగా చెప్పారు. ఇక ఈ వివాదంతో తనకు సంబంధం లేకపోయినా, కొమ్మినేని గారు కూడా క్షమాపణలు కోరారు. అయినా జగన్గారు, భారతిగారు క్షమాపణ చెప్పాలని సీఎం చంద్రబాబు ట్వీట్ వేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. వైయస్ జగన్ సతీమణి భారతిగారిని నోటికొచ్చిన విధంగా తిట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నారు. కిర్రాక్ ఆర్పీ, సీమ రాజు వంటి టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి దారుణంగా తిట్టిపోస్తున్నారు. దానిపై ఆధారాలతో నేనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కృతిమ ఉద్యమంతో అరాచకాలు: మమ్మల్ని నిందిస్తూ, మాపై బురద చల్లేందుకు టీడీపీ ఒక పెడధోరణి అవలంబిస్తోంది. ముందుగా ఏదో జరిగిపోయిందని ప్రజల్లో భ్రమలు, భయాందోళన కల్పించేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్ వరుసగా ట్వీట్లు పెడతారు. దాని ఆధారంగా ఎల్లో మీడియాలో అదే పనిగా డిబేట్లు నడుపుతారు. కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలను మోహరించి ధర్నాలు ఆర్గనైజ్ చేస్తారు. అనుకూల పత్రికలు, వందల యూట్యూబ్ ఛానళ్లలో కథనాలు వండి వారుస్తారు. ప్రభుత్వ తప్పులు, వైఫల్యాలు ఎండగడుతూ ప్రజల పక్షాన పని చేస్తున్న సాక్షి ఛానల్ను ఎలాగైనా ఆపాలనేది చంద్రబాబు కుట్ర. గతంలోనూ వైయస్సార్ మరణించాక కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. అయినా అవన్నీ తట్టుకుని సాక్షి నిలబడింది. ఇప్పుడూ అంతే. పది మందిని పోగు చేసి సాక్షి పత్రిక మీద దాడులు చేయిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు, ఎల్లో మీడియా ఛానళ్లు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. వాటికి ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలు ఈ విధంగా దాడులు చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపటి రోజున ఇదే పరిస్థితి మీకు కూడా వస్తుందేమో?. ఆలోచించుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితవు చెప్పారు.