13న వైయస్‌ జగన్‌ పర్యటన విజయవంతం చేయాలి

జిల్లా అధ్య‌క్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కర్నూలు: కర్నూలు నగరంలోని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి నివాసంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.

సమావేశంలో ఎమ్మెల్సీ తలసిల రాఘురామ్‌, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శ్రీదేవి, గంగుల నాని, మాజీ మేయర్‌ బి.వై. రామయ్య, మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.వి. విజయమనోహరి, నియోజకవర్గ ఇన్‌చార్జులు దారా సుధీర్‌, కోట్ల హర్ష, సతీష్‌, ప్రదీప్‌రెడ్డి, సిటీ అధ్యక్షుడు అహ్మద్‌ అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న వైయస్‌ జగన్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు అవసరమైన కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని చెప్పారు. డీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై రెడ్‌బుక్‌ పేరుతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని కాటసాని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ న్యాయపోరాటం కొనసాగిస్తుందని, అక్రమ కేసులు, దౌర్జన్యాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెబుతామని అన్నారు. 13న జరిగే కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
 

Back to Top