నెల్లూరు జిల్లా: అధికారం ఉన్నా.. లేకున్నా ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటానని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భరోసా కల్పించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండల కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో కాకాణి సమావేశం నిర్వహించారు. కాకాణి గోవర్ధన్రెడ్డి ఏమన్నారంటే.. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు శాసనసభ్యునిగా అవకాశం అందించి, ఆశీర్వదించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ అండగా నిలుస్తాం. కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి కుటుంబంలోని ప్రతి సభ్యునికి సంక్షేమ పథకాలు అందే విధంగా పరిపాలనను అందించారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాటను పక్కనపెట్టి, మోసం చేయబోతున్నాడని నెల రోజుల పాలనలోనే తేటతెల్లమైంది. ఇసుక ఉచితం తెలుగుదేశం నాయకులకు తప్ప, ప్రజలకు కాదు. ఎన్నికలకు ముందు ఇసుక ఉచితం అని చెప్పినా, ప్రజలు మాత్రం డబ్బులు పెట్టి కొనాల్సిందేనని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చాడు. చంద్రబాబు రైతులకు ఉచిత విద్యుత్ పై, మోటార్లకు మీటర్లు బిగించడంపై సమాధానం చెప్పకుండా మాట దాటవేస్తున్నాడు. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే అవి ఉరితాడులే అన్న చంద్రబాబు రైతుల మోటర్లకు మీటర్లు బిగించమని స్పష్టంగా సమాధానం చెప్పాలి. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, తన విజనరీతో సంక్షేమ పథకాలు అందిస్తానన్న చంద్రబాబు సంక్షేమ పథకాల అమలుపై సమాధానం చెప్పకుండా, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేసి, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికలు ఫలితాలు వచ్చిన నాటి నుండి ఒక్కరోజు కూడా నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదు. అధికారం ఉన్నా, లేకున్నా ఎల్లవేళలా అందుబాటులో ఉండే మీ ఇంటి బిడ్డని... సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకుంటా.. తెలుగుదేశం నాయకులు హద్దు మీరి, అన్యాయంగా ప్రవర్తిస్తామంటే ఉపేక్షించేది ఉండదు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీకి చెందినవారు అభివృద్ధి శిలాఫలకాలను, వైయస్ఆర్ సీపీకి చెందిన వారి ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తు పెట్టుకొని మరలా తిరిగి వారి చేతనే పునర్నిర్మించే కార్యక్రమాలు చేపడుతాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించానన్న సంతృప్తి కలిగింది. పార్టీపై, నాపై అభిమానంతో కష్టకాలంలో పార్టీ అండగా నిలుస్తున్న కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు, మరో గెలుపుకు నాంది పలికేందుకు అందరం కలిసి కృషి చేద్దాం.