రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా  

3 ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకు లేఖలు రాస్తున్నారు

మాజీ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి:  రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే జరగాలా అని నిలదీశారు. సీఆర్‌డీఏ చట్టం సవరణ చేసినట్లు ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్‌ అయ్యారు. గురువారం  తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.రాజధానిలో పేదలు, బడుగులు ఉండకూడదా? బాబు పాలనలో దోచుకుని దాచుకోవడం పనిగా పెట్టుకున్నారు. రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. పాదయాత్ర అంటూ మళ్లీ డ్రామా మొదలు పెట్టారని పేర్ని నాని నిప్పులు చెరిగారు.
  

రాజధాని వారి సొంతమా?:
    నిరుపేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిన్న మంత్రివర్గం నిర్ణయించడంతో, దుష్ట చతుష్టయం పొద్దున్నే మొదలుపెట్టింది. రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ. ఏ దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా రాజధాని అంటే ఇది నాది అని అనుకునే విధంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఇక్కడ చంద్రబాబుకు, రామోజీరావుకు, రాధాకృష్ణకు మాత్రం రాజధాని అంటే ప్రజలందరిదీ కాదు. కేవలం వారికి సంబంధించింది మాత్రమే. 
    అందుకే ఇవాళ దుష్టచతుష్టయంలో సభ్యుడైన ఏబీఎన్‌ రాధాకృష్ణ.. రాజధానిపై నిన్న మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శలు చేశారు. అంత పచ్చిగా విమర్శలు చేయడం మీకు మాత్రమే సాధ్యం. దారుణంగా విషం చిమ్మడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. మీకు తప్ప.

నిరుపేదలు ఇక్కడ ఉండొద్దా?:
    ఆనాడు చంద్రబాబు హయాంలో ఎవరికీ భూములు ఇవ్వలేదా? ఆయన అమరావతిలో ఎందరికో భూములు ఇచ్చారు. చివరకు గన్నవరం విమానాశ్రయం వద్ద తనకు కావాల్సిన వారు ఉంటే, వారికి కూడా ఇక్కడే భూములు ఇచ్చారు. కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాలో నిరుపేదలకు, ఇళ్లు లేని వారికి ఇక్కడ ఇళ్లు, భూములు ఇస్తే, ఇక్కడ సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందా? అంటే నిరుపేదలు.. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఇక్కడ ఉండకూడదా? 
    ఈనాడులో కూడా దారుణంగా రాశారు. మొత్తం విషం చిమ్ముతూ విమర్శలు చేశారు. చివరకు పేపర్‌ నడుపుతోంది జగన్‌గారిపై విషం చిమ్మడానికి అన్నట్లుగా ఉంది. అంటే సొమ్ము జనానిది. లాభం మీ ముగ్గురిదా?
    అదే చంద్రబాబు తనకు ఇష్టం వచ్చిన వారికి ఇక్కడ భూములిస్తే, మీకు అసలు కనబడదు. ఎవరికైనా ఆయన ఇక్కడ భూములు ఇవ్వొచ్చు. ఆయన ఎవరికి భూములు ఇచ్చినా మీకు ఏ అభ్యంతరం లేదు. కానీ జగన్‌గారు ఇక్కడ పేదలకు భూములు ఇస్తే మాత్రం తప్పా? అంటే ఇక్కడ మీరు మాత్రమే ఉండాలా? వేరే వారు ఉండకూడదా?. 

అసలు మీరేం త్యాగం చేశారు?:
    అంటే దుష్ట చతుష్టయానిది ఒకటే ఉద్దేశం. ఇక్కడ కేవలం మీ వర్గం వారు లేదా బాగా డబ్బున్న వారు మాత్రమే ఉండాలా? ఇక్కడ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఉండకూడదా? వారు ఇక్కడికి వస్తే, ఇక్కడ ధరలు పడిపోతాయా?. ఇక్కడ మీరు చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి త్యాగం అని పేరు పెడుతున్నారు. అసలు మీరేం త్యాగం చేశారు?.
    రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుతో పెద్ద పేరున్న లాయర్లను పెట్టుకుని, జగన్‌గారు పేదలకు భూములు ఇవ్వాలన్న నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత కిరాతకం?

కలెక్షన్‌ ఫుల్‌.. సానుభూతి నిల్‌:
    ఇంకా కొత్తగా మరో సినిమా. మహా పాదయాత్ర 2.0. ఏదో పాదయాత్ర అట. వెంకటాయపాలెం నుంచి అరసువిల్లి వరకు పాదయాత్ర అట. దేని కోసం ఆ యాత్ర?. ఈ రాజధాని మాది. ఇక్కడ మా వ్యాపారాలే ఉండాలి. మేమే బాగు పడాలి. ఇక్కడికి వేరెవ్వరూ రావొద్దన్నది మీ ఉద్దే«శం.
కృష్ణా, గుంటూరు జిల్లాల వారు కూడా ఇక్కడికి రావొద్దు అనుకునే మీ ఫ్యూడల్‌ మనస్తత్వం. అలాంటప్పుడు మాకు ఎందుకీ రాజధాని?.
    ఒక సినిమా సక్సెస్‌ అయితే మరో సినిమా తీస్తారు. సరిగ్గా అలాగే మీ పాదయాత్ర రాజకీయం. కానీ కలెక్షన్‌ ఫుల్‌. సానుభూతి నిల్‌. ఒక పాదయాత్ర ముగియగానే, మరో యాత్ర మొదలు పెడుతున్నారు. ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. చందాలు వసూలు చేస్తున్నారు. ఆ విధంగా బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకుంటున్నారు. పాదయాత్ర ద్వారా కూడా వ్యాపారం చేస్తున్నారు.

రచ్చతో అపోహలకు కుట్ర:
    చాలా మంది ఇక్కడ ఉద్యమం కోసం అంటూ గాజులు ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా, ఎక్కడా ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు. కానీ ఇక్కడే ఎందుకంత మమకారం?. విశాఖలో పరిపాలన రాజధాని పెట్టాలని జగన్‌గారు అనుకుంటున్నారు కాబట్టి, రచ్చ చేయాలని అక్కడికి పాదయాత్ర తలపెట్టారు. ఆ విధంగా ఇక్కడ ఏదో జరుగుతోందని అందరూ అనుకోవాలన్న దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నారు.

కనీస ఇంగిత జ్ఞానం లేదా?:
    ఇప్పటికైనా దుష్ట చతుష్టయానికి చెప్పేది ఒక్కటే. రాజధానిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే, ఇంత దారుణంగా విషపు రాతలు రాస్తారా? కనీస ఇంగిత జ్ఞానం లేదా? పేపర్‌ చదివే వాళ్లు ఏమనుకుంటారన్న విచక్షణ కూడా లేదా?.    
    అదే చంద్రబాబు భూములు అమ్మినా ఆహా, ఓహో అని సమర్థించారు. ఆయన 600 హామీలు ఇచ్చి, కనీసం 10 కూడా నెవవేర్చకపోయినా, చంద్రబాబు ఒక శూరుడు, వీరుడు అని అభివర్ణిస్తున్నారు. 
    అదే ఇచ్చిన హామీల్లో మూడేళ్లలో 95 శాతం అమలు చేసినా, మీకు అవి కనపడవు. ఆ విధంగా దేశంలో ఎవరైనా, ఎక్కడైనా అమలు చేశారా?
కానీ మీకు అవి కనపడవు. ఎంతసేపూ సీపీఎస్‌ను ప్రస్తావిస్తున్నారు. నిజానికి అ«ధికారంలోకి వచ్చాక, చంద్రబాబు చేసిన పాపాలు చూశాక.. ఇక్కడి పరిస్థితి చూశాక అన్నీ అర్ధమయ్యాయి.
    చంద్రబాబు పదవి దిగిపోయే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఆ విషయం ఈనాడులోనే రాశారు. అయినా జగన్‌గారు నిలదొక్కుకున్నారు. ఎక్కడా, ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఐఆర్‌ ఇచ్చారు.

దౌర్భాగ్య చరిత్ర ఎవరిది?:
    దేశంలో ఎక్కడా లేని విధంగా 2014 నుంచి 2019 వరకు ఒక్క మార్చి నెలలోనే రూ.40 వేల కోట్ల అప్పులు చేసిన దౌర్భాగ్య చరిత్ర ఎవరిది? వెళ్తూ వెళ్తూ కాంట్రాక్టర్లకు రూ.42 వేల కోట్ల బాకీ పెట్టిపోయింది ఎవరు? ఆ దిక్కు మాలిన చరిత్ర ఎవరిది? విత్తనాలు సేకరించి, రైతులకు ఆ డబ్బులు రూ.800 కోట్లు కూడా ఇవ్వకుండా పోయింది ఎవరు? ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా రూ.1200 కోట్లు ఎగ్గొట్టి పోయింది ఎవరు? వరసగా నాలుగేళ్లు రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించకుండా పోయింది ఎవరు?
    ఇన్ని ఆర్థిక సమస్యల మధ్య.. అనివార్య పరిస్థితుల్లోనే సీపీఎస్‌ బదులు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయలేక పోతున్నామని, కాబట్టి అర్ధం చేసుకోవాలని సీఎంగారు ఉద్యోగులను కోరుతున్నారు. తమ ప్రతిపాదలనకు అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఆ విధంగా లాభం పొందాలని చూస్తున్నాడు.

రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు:
    చంద్రబాబు హయాంలో 5 ఏళ్లు ఆర్థిక మంత్రిగా చేసిన నాయకుడు ఏం చెప్పారు? తాము అవకాశం ఉన్న ప్రతి చోటా అప్పులు చేశామని, కాబట్టి జగన్‌గారికి ఎవరూ అప్పులు ఇవ్వరని అన్నాడు. గతంలో మునులు యజ్ఞం చేస్తుంటే, రాక్షసులు దాన్ని భగ్నం చేసేవారని పురాణాల్లో చదివాం.
దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా, ఇక్కడ బల్క్‌ ఫార్మా యూనిట్‌కు అనుమతి ఇస్తే, దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయొద్దని ఈ అరకోటు పెద్దమనిషి కేంద్రానికి లేఖ రాశాడు. అదే పెద్దమనిషి 2015–16లో తునిలో దివిస్‌ కంపెనీ ఏర్పాటు చేయాలని ఆనాడు క్యాబినెట్‌లో కోరాడు. ఆ పెద్ద మనిషి ఇవాళ అక్కడ బల్క్‌ ఫార్మా వద్దని లేఖ రాశాడు. అంటే ఆనాడు ఆయనకు దివిస్‌ కంపెనీ ఒక స్వర్గంలా కనిపిస్తే, ఇవాళ బల్క్‌ డ్రగ్‌ ఫార్మా వస్తే, అది విషం చిమ్ముతుందని అంటున్నాడు.
    నిజానికి కంపెనీ నుంచి ఇసుక రేణువు అంత కూడా కాలుష్యం బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సింగపూర్‌ వెళ్లి రూ.3 లక్షలు ఖర్చు చేసి పన్ను పీకించుకున్నంత ఈజీగా లెటర్‌ రాశాడు.

మరోసారి చరిత్రహీనుడు:
    తనకు రాజకీయ బిక్ష పెట్టి, స్పీకర్‌ను చేసిన ఎన్టీ రామారావుకు, చివరకు ఆ సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వ్యవహరించి, చరిత్ర హీనుడిగా మిగిలాడు. ఆ లేఖ ద్వారా మరోసారి చరిత్ర హీనుడిగా మిగులుతానని అనుకోని ఆ అరకోటు పెద్ద మనిషికి సిగ్గు ఎగ్గు లేదు. దేవుడు ఆయనకు బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలి.

వాస్తవాలు గుర్తించండి:
    ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో, అన్ని చోట్లా అభివృద్ధి జరగాలి. అందుకే విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని రావాలి. అదే మా లక్ష్యం.     కానీ మీరు అమరావతిని కేవలం మీ రాజధాని మాత్రమే అని అనుకుంటున్నారు. అందుకే ఆ దొడ్లోకి ఎవరూ రాకూడదని కోరుకుంటున్నారు. డబ్బున్న వారు మాత్రమే రావాలని అనుకుంటున్నారు.
    ఆ విధంగా మీరు ఫ్యూడల్‌ ఆలోచనతో ఉన్నారు. మీకు ఈ దుర్భుద్ది ఉన్నన్నాళ్లు, మీ రాజకీయాలు ఇంకా క్రుంగి కృషిస్తాయి. ఈ విషయాన్ని ఇకనైనా దుష్ట చతుష్టయం ఈ వాస్తవాన్ని గుర్తించాలి.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

కిరాయి మనుషులు. ట్వీట్లు:
    మంత్రులను మార్చడం కంటే, ముఖ్యమంత్రిని మార్చొచ్చు కదా అని లోకేష్‌ ట్వీట్‌ చేశాడా? అదో పనికి మాలిన పని. ఎవరో ఒక మనిషిని కిరాయికి పెట్టుకోవడం. ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు పెట్టడం. దానికి పైసా పెట్టుబడి లేదు. జీతగాళ్లను పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. 2017లో అనుకుంటా. ఇప్పుడు ఈ ట్వీట్‌ పెట్టిన లోకేష్‌ అసలు మంత్రి ఎలా అయ్యాడు? మీ అయ్యకు చెప్పవా? ఆయనకు ట్వీట్‌ పెట్టవా? జగన్‌గారు మాత్రమే దొరికారా?

నాయకుడంటే అలా..:
    నాయకుడు అంటే.. తన సహచరులను ప్రేమించేవాడు. ఆయనే జగన్‌గారు. అలాగే జక్కంపూడి రామ్మోహన్‌రావు అనారోగ్యానికి గురైతే, 5 ఏళ్లు తన మంత్రివర్గంలో కొనసాగించిన గొప్ప నాయకుడు వైయస్సార్‌గారు.
    అదే మీ నాయన మీద నక్సలైట్లు దాడి చేసినప్పుడు ఆ కారులో ఉండి, గాయపడిన బొజ్జల గోపాలకృష్ణతో పాటు, కిమిడి మృణాళిని, పల్లె రఘునాథరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి ఎందుకు తీసేశారు? ఆనాడు 5గురిని తీసేస్తేనే కదా.. మీకు మంత్రి పదవి వచ్చింది. అవేవీ మీకు గుర్తు లేవా?

ట్వీట్లు రివర్స్‌ అవుతాయి:
    అందుకే ఏది పడితే అది ట్వీట్‌ చేయొద్దు. అవి మీకే తగులుకుంటాయి. నీకు మంత్రి పదవి కోసం ఇంట్లో పోరు చేస్తే, గొడవ చేస్తే, 5గురిని తీసేసి, నీకు మంత్రి పదవి ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా లోకేష్‌ ట్వీట్‌ చేస్తే బాగుంటుంది.

కొడుకును అదుపులో పెట్టుకో:
    చంద్రబాబుకు కూడా ఒక విజ్ఞప్తి. మీ వయస్సు మీ అనుచరులు చెప్పిన దాని ప్రకారం 79 ఏళ్లు. సర్టిఫికెట్‌ ప్రకారం 74 ఏళ్లు. కాబట్టి ఇకనైనా మీరు మీ కొడుకును అదుపులో పెట్టుకోవాలి. నీ కొడుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది మీకే నష్టం. ఎందుకంటే ప్రజల గుండెల్లో జగన్‌గారి స్థానం సుస్థిరం. కాబట్టి మీ అబ్బాయి నోరు కట్టడి చేస్తే బాగుంటుంది.. అని మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని సూచించారు.

Back to Top