అసెంబ్లీ: అక్షర క్రమంలోనే కాదు.. అక్షరాస్యతలోనూ ఆంధ్రప్రదేశ్ను ముందు నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి చేస్తున్నారని, బుడి బుడి అడుగులు వేసే ప్రతి బిడ్డ బడిలో ఉండాలని అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కంటే జగనన్న రెండు అడుగులు ముందుకు వేశారని, జగన్ అంటే పేరు కాదు.. జగన్ అంటే ఒక బ్రాండ్ అని, దానికి ట్యాగ్ లైన్ చెప్పాడంటే.. చేస్తాడంతే.. అని పుష్పశ్రీవాణి అన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైయస్ జగన్ విప్లవాత్మకమైన ఆలోచనలు చేయగలరో అమ్మఒడి పథకాన్ని చూస్తే అర్థం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం అమలు చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. తమ బిడ్డలను, జూనియర్ కాలేజీలకు పంపే ప్రతి పేద తల్లికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన జగనన్న ప్రభుత్వమే. చిన్నప్పుడు చదువు నేర్పేటప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఏ ఫర్ అమ్మఒడి అని చెప్పే విధంగా ఈ పథకం ఉంది. అ అంటే అమ్మఒడి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని అక్షరాలు దిద్దేలా నిలిచిపోయే చారిత్రకమైన పథకం అమ్మఒడి అని గర్వంగా తెలియజేస్తున్నాను. బిడ్డకు అమ్మ పాలు ఎంత శ్రేయస్సుకరమో.. ఈ అమ్మఒడి కూడా అంతే శ్రేయస్కరం అని తెలియజేస్తున్నాను. బుడి బుడి అడుగులు వేసే ప్రతి బిడ్డ బడిలో ఉండాలనే లక్ష్యంతో అమలు చేస్తున్నది ఈ అమ్మఒడి. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో పేదరికం పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించారు. ఏ కుటుంబంలో అయితే చదువుకున్నవారు ఉంటారో.. ఆ కుటుంబంలో పేదరికం ఉండదని వైయస్ఆర్ నమ్మిన సిద్ధాంతం. అందుకే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వర్గాల్లో ఉన్న పేదరికం సమూలంగా నిర్మూలించాలంటే.. ఉచితంగా విద్య అందించడమే మార్గమని నమ్మారు. మా తమ్ముడు కూడా ఫీజురీయింబర్స్మెంట్ ద్వారానే చదువుకున్నాడు. ఒక మంచి ఆలోచన చేసినప్పుడు మనిషి లేకపోయినా తరువాతి తరాలకు కూడా ఆ మంచి చేరుతుందనేందుకు నిదర్శనం ఫీజురీయింబర్స్మెంట్ పథకం. ఉన్నత విద్య గడప తొక్కలేని పేదవాడి ఇంటి వద్దకే ఉన్నత విద్యను తీసుకువచ్చింది. తండ్రి ఫీజురియింబర్స్మెంట్ ద్వారా చదివిస్తే.. తనయుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇచ్చాడని, సీఎం వైయస్ జగన్ వైయస్ జగన్ చిరస్థాయిలో నిలిచిపోతారని ప్రతీ తల్లి చెప్పుకుంది. చదువుల విప్లవం స్ఫూర్తితో సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారు. నాడు వైయస్ఆర్.. నేడు వైయస్ జగన్.. ప్రజల కోసం మండుటెండల్లో పాదయాత్ర చేసిన ప్రజా నాయకులు. కష్టాలు, కన్నీరు కళ్లారా చూసిన నాయకులు కాబట్టే పేదల కోసం ఇంత గొప్పగా ఆలోచన చేస్తున్నారు. వైయస్ఆర్ కంటే జగనన్న రెండు అడుగులు ముందుకు వేశారు. జగన్ అంటే పేరు కాదు.. జగన్ అంటే ఒక బ్రాండ్.. దానికి ట్యాగ్ లైన్ చెప్పాడంటే.. చేస్తాడంతే.. మన రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యులు ఉన్నారు. మనం గుడికి, మార్కెట్కు, హోటల్కు వెళ్లినా.. చదువు మధ్యలో మానేసిన పసిపిల్లలను చూస్తున్నాం. పిల్లల బాల్యం, ఉజ్వల భవిష్యత్తు పేదరికానికి బలైపోకూడదని సీఎం వైయస్ జగన్ అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటికీ లేదు. దేశ చరిత్రలోనే మొదటిసారి సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మందికిపైగా తల్లులకు ఆర్థికసాయం అందించాం. అమ్మఒడి పథకం చేసేటప్పుడు పార్టీలు, ప్రాంతాలు చూడలేదు. జగన్ మొండోడు.. ఎవరి మాట వినడని అంటుంటారు.. నిజమే ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాల విషయంలో మొండోడే.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆయన మొండోడే.. ఎవరిమాట వినరూ.. అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకే ఇవ్వండి అని సూచన చేసినా వినలేదు.. ప్రైవేట్ స్కూళ్లలో చదివే ప్రతి పేద తల్లికి పథకం అందాలని చూశారు.. అందుకే జగన్ అన్న మొండోడు. బియ్యపు గింజ మరిగే పాలల్లో కలిస్తే పాయసం.. నీళ్లలో కలిస్తే అన్నం.. పసుపులో కలిస్తే అక్షింతలు.. అదే బొగ్గులో కలిస్తే చేతబడి అవుతుంది. ప్రజలు కూడా పాలతో కలవాలో.. బొగ్గులో కలవాలో నిర్ణయించుకొని స్వచ్ఛమైన మనస్సు ఉన్న జగనన్నతో కలిసి నడిచారు. నాయకుడిగా ఎన్నుకున్నారు. ఒక మహిళా గర్వంగా చెబుతున్నా.. జగనన్నలా నిరుపేద విద్యార్థుల కోసం ఆలోచించిన నాయకుడి కోసం ఇప్పుడే చూస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి పేద బిడ్డకు ఈ పండుగకు మేనమామ కానుక జగనన్న ఇచ్చారు. అమ్మఒడి పథకం ఒక్కటే కాకుండా కార్పొరేట్ విద్యను కామన్మెన్ బిడ్డలకు కూడా అందించే అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది. నాడు –నేడుతో ప్రతి పాఠశాలలో తొమ్మిది రకాలు వసతుల కల్పన, అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం, పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి యూనిఫాం, షూ, పుస్తకాలు ఉచితంగా ఇచ్చే ఏర్పాటుతో పాటు ఇంగ్లిష్ మీడియం విద్యను అందరికీ అందించబోతున్నాం. అక్షర క్రమంలోనే కాదు.. అక్షరాస్యతలోనూ ఆంధ్రప్రదేశ్ను ముందు ఉంచేందుకు సీఎం వైయస్ జగన్ కృషిచేస్తున్నారు.