ఇన్నాళ్లకు మన కన్నీళ్లు తుడిచే అన్నొచ్చాడు

డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి

విజయమ్మలో మమకారం, వైయస్‌ఆర్‌లో మానవత్వం..ఈ  రెండు కలిపితే మా జగనన్న  

 రాష్ట్రంలో ఏ తల్లి కన్నీరు కార్చిన స్పందిస్తారన్న నమ్మకం  ఈ చట్టం ద్వారా కలిగించారు

అసెంబ్లీ: ఇన్నాళ్లకు మన కన్నీళ్లు తుడిచే అన్నొచ్చాడన్న నమ్మకం రాష్ట్రంలోని ప్రతి మహిళకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిశ చట్టం ద్వారా కలిగించారని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి పేర్కొన్నారు. దిశ చట్టంపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఈ రోజు ఈ సభలో ఇంతగొప్ప మహిళా భద్రత చట్టాన్ని తీసుకొచ్చినందుకు రాష్ట్రంలోని మహిళలందరి తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాములు. తొలి అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ సభలో ఎన్నో చారిత్మాత్మక చట్టాలు తీసుకున్నందుకు స్పీకర్‌కు కూడా ధన్యవాదములు. ఈ రోజు ఈ చట్టాన్ని ఒక డిప్యూటీ సీఎంగానే కాకుండా సామాన్య మహిళాగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. గతంలో మహిళల భద్రతపై స్టేట్‌మెంట్లకే పరిమితమైతే మా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దేశానికే దిశా నిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించినందుకు గర్వపడుతున్నాం. ఇంత గొప్ప మహిళా పక్షపాతి అయిన వైయస్‌ జగన్‌ కేబినెట్‌లో గిరిజన మహిళ అయిన తనను డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చినందుకు గర్వ పడుతున్నాను. జీవితాంతం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటాను.  ఈ చట్టం మాలో ఓ నమ్మకాన్ని కలిగించింది. నిత్యం నరకంలో నడిచే యావత్తు మహిళా లోకానికి నమ్మకం కలిగిచింది. ఆ నమ్మకం ఎలాంటిదంటే ఈ చట్టం వల్ల న్యాయస్థానంలో న్యాయదేవత గంతలు తెంచుకొని ఆడవాళ్లపై ఆఘాయిత్యాలకు పాల్పడే వారిపై ఆది పరాశక్తిగా మారుతుందన్న నమ్మకం కలిగింది.  ఈ చట్టం పోలీసుల తలపై  ఉన్న కనిపించే మూడు సింహాలైతే కనిపించని నాలుగో సింహం ఒక్కటై ఆడవాళ్లను హింసించే మానవ మృగాలను వేటాడుతాయన్న నమ్మకం కలిగించింది. ఈ చట్టం అనాదిగా అల్లరి మూకలు, ఆకతాయిశక్తులు, రాక్షస క్రీడకు బలై పోతున్న మహిళల గుండెల మంటను చల్లార్చి గుండె ధైర్యాన్ని నింపింది. స్ర్తీ అంటే  అవసరాలు తీర్చే యంత్రంగానో, స్ర్తీ అంటే  అవమానాల కోసం పుట్టే ప్రాణంగానో..రేపిస్టులకు ప్రయోగశాలగానో భావిస్తున్న తరుణంలో ఆ స్త్రీకి ఈ చట్టం ఒక రక్షణగా వచ్చిందన్న నమ్మకం ఈ రోజు కలిగింది. నిన్నటి వరకు ఈ రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ స్త్రీల మానసిక స్థితి ధైన్యంగా ఉండేది.దిశ అత్యాచారం చూసిన తరువాత మహిళల మానసిక సంఘర్షణ రోడ్డుకెక్కింది. తండ్రి వయసులో ఉన్నవారు, తమ్ముడిలా చూసిన వారు, పాఠాలు చెప్పే లెక్చరర్స్‌, గుర్తు తెలియని వారు ఇలా ఎవరు పడితే వారు ఆడవాళ్ల జీవితాలను అడవి మృగాలుగా దారుణాతీ దారుణంగా హత్య చేస్తున్నారు. మనం ఏంచేసినా ఎవరు అడిగే వారు లేరన్న పొగరుతో రెచ్చిపోతున్నారు.  అలాంటి వారి చేతిలో బలై పోతున్నారు. ఆడవాళ్ల తరఫున అడిగేందుకు ఒక చట్టం వచ్చిందని తెలియజేస్తూ..ఆ చట్టాన్ని అమలు చేసే దమ్మున్న ముఖ్యమంత్రి మన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  అనే నమ్మకం యావత్తు మహిళా లోకానికి కలిగింది. నిన్నటి వరకు నాకే కాదు..ఈ దేశంలోని ఏ మహిళకు ఆ నమ్మకం లేదు. ఇప్పటి వరకు మనకు అనేక చట్టాలు ఉన్నాయి. నిర్భయ చట్టం, ఫోక్సో చట్టం, వరకట్న వేధింపుల చట్టం, ఇండియన్‌ పినలీ కోర్టు, గొప్ప న్యాయ వ్యవస్థ, ప్రతిష్టమైన పోలీసు వ్యవస్థ అన్నీ ఉన్నాయి. కానీ దిశ సంఘటన జరిగిన తరువాత ఆ చట్టాలు శిక్షిస్తాయన్న నమ్మకం  ఎవరికి కలుగలేదు. అందుకే దిశను చంపిన మృగాలు దిక్కులేని కుక్కచావు తక్షణమే కావాలని దేశంలోని మహిళలంతా గుండెలవిసేలా నినదించారు. దిశను దారుణంగా చంపిన ఆ నలుగురు ఎన్‌కౌంటర్‌ అయితే ప్రతి మహిళా శభాష్‌ పోలీస్‌ అని అభినందించింది. చట్టమంటే భద్రత..భయం రెండు కలిగించాలి.అలా కానప్పుడు బలవంతులకు చుట్టమే కాని బలహీనులకు న్యాయం చేసే చట్టం అవ్వదు. అందుకే ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు మా సీఎం వైయస్‌ జగన్‌ గొప్ప చట్టాన్ని తీసుకువచ్చారు. పాదయాత్ర సమయంలో నేను కానీ, మా పార్టీ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త ఒక మాట చెప్పేవాళ్లం. అన్నొస్తున్నాడు..మనకు అండగా నిలుస్తాడని చెప్పాం. ఈ రోజు ఈ చట్టం చూసిన తరువాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి  ఇంట్లో ఉన్న ఆడబిడ్డ నిజంగానే మా అన్న వచ్చాడనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో కలిగింది. మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇద్దరి ఆడబిడ్డల తండ్రిగా దిశ ఘటనపై చలించిపోయినప్పుడు మహిళలుగా ఇక్కడున్న నేను, మిగతా మన మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు..ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ఇన్నాళ్లకు మన కన్నీళ్లు తుడిచే అన్నొచ్చాడన్న నమ్మకం కలిగింది.  ఆ రోజు వైయస్‌ జగన్‌ మాట్లాడిన తీరులో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే స్పందించే ఒక తండ్రి కనిపించాడు. ఒక చెల్లిపై అఘాయిత్యం జరిగితే స్పందించే అన్న కనిపించాడు. ఒక అక్కకు అన్యాయం జరిగితే స్పందించే ఓ తమ్ముడు కనిపించారు. చందమామలో మనం అందాన్ని చూస్తాం..వెన్నెలను చూస్తాం. కొంత మంది కేవలం మచ్చనే చూస్తారు. ఆ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించిన తీరులో టోల్‌గేట్‌ మాత్రమే కనిపించింది. అది చందమామలో మచ్చకాదు. అది వారి మనసులో ఉన్న మచ్చ. ఎన్నికల ఫలితాల తరువాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ బెజవాడ దుర్గమ్మ సాక్షిగా, ఆయన తల్లి విజయమ్మ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన బిడ్డ, తన భర్త వైయస్‌ రాజశేఖరరెడ్డి అంత గొప్పవాడు అయ్యాడని ఉద్వేగంతో ఆ రోజు విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. అమ్మ కన్నీళ్లు పెడతే ఒక్క క్షణం కూడా ఆగలేకపోయిన జగనన్న ఆ రోజు ఆమె కన్నీళ్లు తుడిచి ఓదార్చిన సందర్భం తలుచుకుంటే మనందరి కళ్లలో ఈ రోజుకు కూడా కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. తన తల్లి కన్నీరు పెడితే  ఎలా స్పందించి ఆ కన్నీటిని తుడిచారో  ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ తల్లి కన్నీరు కార్చిన అలాగే స్పందిస్తారన్న నమ్మకం మాకు జగనన్న ఈ చట్టం ద్వారా కలిగించారు. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని రెండో అక్షరం  కలిపితే అన్న అవుతుంది. విజయమ్మలో మమకారం, వైయస్‌ఆర్‌లో మానవత్వం రెండు కలిపితే మా జగనన్న అవుతారు. రాష్ట్రంలో మహిళలందరికీ అన్న ఉండొచ్చు..ఉండకపోవచ్చు.కానీ కన్నీళ్లు కార్చే ప్రతి ఆడబిడ్డకు మాత్రం జగనన్న అండగా ఉంటారన్న నమ్మకం ఈ చట్టం చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఇంత నమ్మకం కలిగిందంటే..మన రాష్ట్రంలో ఈ చట్టం చేయమని ఏ ప్రతిపక్షం కోరలేదు. ఏ ప్రజా సంఘం నిలదీయలేదు. ఏ మహిళా సంఘం నిందించలేదు. ఏ మహిళా రోడ్డెక్కలేదు. కానీ మన సీఎం వైయస్‌ జగన్‌ అడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలు చూసి చలించిపోయారు. ఇలాంటి క్రురమృగాలు మనుషుల మధ్య తిరగడం  భావ్యం కాదని భావించి ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు.  ఈ చట్టం మహిళలకు నమ్మకాన్నే కాదు..మృగాలకు భయాన్ని పుట్టిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ఆడవాళ్లపై అత్యాచారం, హత్య జరిగినట్లు తేలితే మొదటి వారంలోనే కేసు విచారణ, మూడు వారాల్లోనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు. అది కూడా మరణ శిక్ష అని తెలియజేస్తున్నా..సోషల్‌ మీడియాపై మహిళలపై దారుణంగా పోస్టింగ్‌లు పెట్టేవారికి మొదటిసారిగా రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి నాలుగేళ్ల శిక్ష పడేలా ఈ చట్టం రూపొందించారు. ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ స్ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది.  మహిళా భద్రతపై చర్చను అడ్డుకున్న చంద్రబాబును ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా.. మీ నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఏనాడైనా మహిళల భద్రత కోసం ఇంతటి పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచన రాలేదు.  మహిళల భద్రతపై తీసుకువచ్చిన చట్టంపై చర్చించేందుకు కూడా వారికి ఇష్టం లేక సభ నుంచి వాకౌట్‌ చేశారు. వీళ్లకు మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్నది ఈ సందర్భంలో తెలియజేస్తుంది.  టీడీపీ హయాంలో ఎంతో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు జరిగాయి. దానికి ఉదాహరణ తానే. ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భర్త, ఎంపీపీ భర్త, అక్కడున్న టీడీపీ నాయకులంతా నాపై దాడి చేసి ఆ రోజు ఏ రకంగా చట్టాన్ని చేతుల్లో పెట్టుకొని లూప్‌హోల్స్‌తో కనీసం చార్జ్‌షీట్‌ కూడా వేయలేదు.  మన ప్రభుత్వం వచ్చిన తరువాత జూన్‌ నెలలో అన్ని ఎవిడెన్స్‌ చూపించి చార్జిషిట్‌ వేశారంటే మహిళలకు వీళ్లు ఇచ్చే భద్రత ఏరకంగా ఉందో అర్థమవుతుంది.  చివరగా..ఎక్కడ స్త్రీలు గౌరవింపబడుతారో అక్కడ దేవతలు కొలువుదీరుతారంటారు. నేను ఘంటాపధంగా చెబుతున్నాను. ఈ చట్టం వచ్చిన తరువాత రాష్ట్రంలో మహిళలు గౌరవించబడుతారని ఈ సందర్భంలో చెబుతున్నాను. వైయస్‌ జగన్‌ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో దేవతలు కొలువుతీరుతారన్న నమ్మకం కలిగింది. దిశ ఘటన తరువాత ఇంత గొప్ప చట్టాన్ని తీసుకువచ్చి  ఈ దేశానికే దిశా నిర్దేశంగా నిలిచిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక మహిళా మంత్రిగా నా జీవితంలో ఇక ఎప్పటికీ ఇంతకంటే గొప్ప చట్టం వస్తుందని అనుకోవడం లేదు. అలాంటి మహిళా భద్రత చట్టాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ యావత్తు మహిళా లోకం తరఫున సీఎం వైయస్ జగన్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా...

Read Also: దిశ చట్టం ద్వారా అభయాంధ్రప్రదేశ్ గా ఏపీ

 

Back to Top