చెరువుకొమ్ముపాలెంలో నలుగురు చిన్నారుల మృతి తీవ్ర విషాదకరం: వైయస్‌ జగన్‌

 ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృతిచెందిన విషాదకర ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అత్యంత పిన్న వయసులో ఉన్న నలుగురు చిన్నారులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబాల్లో నెలకొన్న విషాదం మాటల్లో వర్ణించలేనిదని అన్నారు.

మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ గారాల పట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిదని పేర్కొంటూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించిన వైయస్ జగన్, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

Back to Top