ఉచిత విద్యుత్ న‌గ‌దు ఇక‌ రైతుల ఖాతాల్లోకే..

రైతులే డిస్కంల‌కు చెల్లిస్తారు.. ప్రశ్నించగలుగుతారు 

బొగ్గు కొనుగోలు విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి

మూడేళ్ల‌లో 3 దశల్లో అందుబాటులోకి 45 మిలియన్‌ యూనిట్లు సెకీ విద్యుత్ 

దీంతో పాటు కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో 800 మెగావాట్ల థ‌ర్మల్‌ విద్యుత్‌ యూనిట్లు

సీలేరులో కొత్తగా 1350 మెగావాట్ల ప్రాజెక్టు వీలైనంత వేగంగా పూర్తిచేయాలి

పారిశ్రామిక రంగ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ స‌ర‌ఫ‌రా చేయాలి

వైయ‌స్ఆర్‌ జలకళను పారదర్శకంగా అమలు చేయాలి

ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

విద్యుత్ శాఖ‌పై సీఎం స‌మీక్ష‌

తాడేపల్లి: ఉచిత విద్యుత్‌ డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. రైతులే డిస్కంల‌కు చెల్లిస్తారని, దీనివల్ల విద్యుత్ సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారని చెప్పారు. విద్యుత్‌ శాఖపై సీఎం వైయ‌స్‌ జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ డిమాండ్‌, స‌ప్ల‌య్‌, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన‌ సమావేశానికి విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఏపీజెన్‌కో ఎండీ బి.శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ ఎన్‌. వి. రమణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ  సంద‌ర్భంగా విద్యుత్‌రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సరఫరా సంక్షోభం, విద్యుత్‌ ఉత్పత్తి రంగంపై పడ్డ ప్రభావం తదితర అంశాలను వివరించారు. అంతర్జాతీయంగా, దేశీయంగా వచ్చిన పరిణామాలతో బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయంతో పలు రాష్ట్రాల్లో తీవ్ర కొరత ఉందని చెప్పారు. సరిపడా రైల్వే ర్యాక్స్‌ను సరఫరా చేయలేకపోతున్నారని, వెసల్స్‌ కూడా తగినంతగా అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో బొగ్గు ధరలు విపరీతంగా పెరగడం.. ఈ కారణాలన్నీ విద్యుత్ కొరతకు దారితీశాయని అధికారులు చెప్పారు. మరోవైపు డిమాండ్‌ కూడా గతంలో కన్నా అనూహ్యంగా పెరిగిందని వివ‌రించారు. గడచిన మూడేళ్లుగా వర్షాలు బాగా కురిశాయని, భూగర్భజలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయరంగం నుంచి కూడా డిమాండ్‌ స్థిరంగా ఉందన్నారు. మరోవైపు కోవిడ్‌ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తిరంగం పుంజుకుందని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు కూడా అధికస్థాయిలో ఉన్నాయని, ఫలితంగా అధిక వినియోగం ఉందన్నారు. ఏప్రిల్‌ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 12,293 మిలియన్‌ యూనిట్లకు చేరిందని, రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్‌ ఇదని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. 

ఎంత ఖర్చు అయినా కొనుగోలు..
వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీ ఎత్తన విద్యుత్‌ను కొనుగోలు చేశామ‌ని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. మార్చిలో సగటున రోజుకు రూ.36.5 కోట్లు ఖర్చు చేసి విద్యుత్‌ కొనుగోలు చేశామని, ఏప్రిల్‌లో సగటున రోజుకు రూ.34.08 కోట్లు వెచ్చించి కరెంటు కొన్నామన్నారు. వినియోగదారులు ఇబ్బంది పడకుండా, కరెంటు కోతలను అధిగమించడానికి, మార్చి నెలలో మొత్తంగా 1268.69 మిలియన్‌ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామ‌ని,  ఏప్రిల్‌లో 1047.78 మిలియన్‌ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని తెలిపారు. బొగ్గు విషయంలో రానున్న రెండు సంవత్సరాలు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయన్న సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. జనరేషన్‌ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం వరకూ విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు నొక్కిచెప్తున్నారని వెల్లడించారు. 

డిమాండ్‌ను అంచనా వేసుకుని ఆ మేరకు కార్యాచరణ చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. బొగ్గు కొనుగోలు విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. అనూహ్య డిమాండ్‌ ఉన్నా కొన్ని నెలల్లో పీక్‌ సమయాల్లోనూ మిగులు విద్యుత్‌.. సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్‌ యూనిట్లు రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులో వస్తోందని చెప్పారు. మూడు సంవత్సరాల్లో మొత్తం మూడు దశల్లో అందుబాటులోకి సెకీ విద్యుత్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని, 2023 చివరి నాటికి  మొదటి దశలో సుమారు 18 మిలియన్‌ యూనిట్లు, రెండో దశలో సుమారు 18 మిలియన్‌ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు. 

దీంతో పాటు రాష్ట్రంలో కృష్ణపట్నంలో కొత్తగా 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల థ‌ర్మల్‌ విద్యుత్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. 85 శాతం పీఎల్‌ఎఫ్‌ అంచనా వేసుకుంటే మరో 30 మిలియన్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తుంద‌న్నారు. మొత్తంగా 48 మిలియన్‌ యూనిట్లు అతిత్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి వస్తోంద‌న్నారు. సీలేరులో కొత్తగా 1350 మెగావాట్ల కొత్త ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తిచేయడానికి దృష్టిపెట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. డీపీఆర్‌ పూర్తయ్యిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్‌.. జూలై–ఆగస్టు నాటికి కృష్ణపట్నం విద్యుత్‌ వినియోగదారులకు అందనుందని అధికారులు తెలిపారు. విజయవాడ థర్మల్‌ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి ప‌నులు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. పోలవరం పవర్‌ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే టన్నెల్స్‌ తవ్వకం పూర్తయ్యిందని, ఈ ప్రాజెక్టుల వల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్‌ను సాధించగలుగుతామ‌ని వివ‌రించారు. 

పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాపై మళ్లీ చర్యలు తీసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు రాకుండా చూడాల‌న్నారు. వారి డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని, ఈ విషయంలో పారిశ్రామిక రంగ వ్యక్తులతో కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోవాల‌ని సూచించారు. వచ్చే వేసవిలో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. 

ప్లాంట్ల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు, జెన్‌కో ఆధ్వర్యంలో ఉన్న  ప్లాంట్లను అత్యుత్తమ సామర్థ్యంతో నిర్వహించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 85 శాతం పీఎల్‌ఎఫ్‌ సామర్థ్యంతో నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని వల్ల నాణ్యమైన విద్యుత్‌, మంచి ధరకే అందుబాటులోకి వస్తోందన్నారు. అంతేకాకుండా.. విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చులు తగ్గించేలా ఆలోచనలు చేయాల‌న్నారు. ఖ‌ర్చులు తగ్గినా ఆదాయం వచ్చినట్టు లెక్క అని అభిప్రాయ‌ప‌డ్డారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇంకా ఏం మాట్లాడారంటే..

- పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తుకు భరోసా
- విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు
- పర్యావరణ హిత విధానాలతో విద్యుత్‌ ఉత్పత్తి
- బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి మళ్లుతున్న ప్రపంచం
- ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలు అవసరం
- పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతి
- రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై దృష్టిపెట్టాలి, తదేక శ్రద్ధతో దీనిపై పనిచేయాలి
- భూ సేకరణ దగ్గరనుంచి అన్నిరకాలుగా సిద్ధంకావాలి
- ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది
- పీక్‌ అవర్స్‌లో అధిక ఖర్చుకు విద్యుత్తు కొనుగోలు చేసే ఇబ్బందులు, పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌ వల్ల తొలగిపోతాయి
- ఒక్కసారి ప్రాజెక్టు పెట్టిన తర్వాత గరిష్టంగా 90 ఏళ్లపాటు ఆ కరెంటు అందుబాటులో ఉంటుంది

ఉచిత విద్యుత్‌-డీబీటీ
- ఉచిత విద్యుత్‌ డబ్బు రైతుల ఖాతాల్లోకే, వారిద్వారానే డిస్కంలకు చెల్లింపులు
- డీబీటీ ద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాలోకే..
- నేరుగా రైతులే చెల్లించేలా ఏర్పాటు 
- దీనివల్ల విద్యుత్‌ సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారు
- ఎక్కడ ఇబ్బంది వచ్చినా.. వెంటనే సిబ్బందిని ప్రశ్నించగలడు.
- విద్యుత్తు శాఖకూడా రైతులనుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారంపై నిరంతరం ధ్యాసపెట్టగులుగుతుంది, జవాబుదారీతనం పెరుగుతుంది.
- మీటర్లు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యమైన కరెంటు అందడంతో పాటు మంచి సేవలు రైతులకు అందుతాయి.

శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం..
- శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్‌ విజయవంతం అయ్యిందన్న అధికారులు
- జిల్లాలో ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చామని,  రైతుల ఖాతాలనుంచి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపిన అధికారులు
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఖర్చయ్యిందని తెలిపిన అధికారులు.
- 2021-2022 ఆర్థిక సంవత్సరంలో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరుకున్నాయని, అయినా సరే 67.76 మిలియన్‌ యూనిట్ల కరెంటు మాత్రమే వినియోగించారని తెలిపిన అధికారులు.
- సంస్కరణల వల్ల, రైతుల ఖాతాల ద్వారా చెల్లింపులు వల్ల కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని, రైతులకూ నాణ్యమైన విద్యుత్‌ అందుతోందని తెలిపిన అధికారులు.

పారదర్శకంగా జలకళ
- వైయ‌స్ఆర్‌ జలకళను పారదర్శకంగా అమలు చేయాలి.
- మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పాం.
- కానీ, మనం మోటారు ఉచితంగా ఇస్తున్నాం, దాంతోపాటు రూ.2 లక్షల విలువైన విద్యుద్దీకరణ పనులను ఉచితంగా చేస్తున్నాం.
- రైతులకు దీనివల్ల మరింత మేలు జరుగుతుంది.

Back to Top