ఆన్‌లైన్‌ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ సైట్లను నిషేధించండి

కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

తాడేపల్లి: పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్‌లైన్‌ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్‌ చేసేలా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖ రాశారు. ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ వల్ల ఎంతో మంది ఆత్మహత్యల పాలవుతున్నారు. డబ్బు పోగొట్టుకోవడంతో పాటు దానికి తీవ్రమైన బానిసలవుతున్నారు. దీనిలో భాగంగానే ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974లో ఆన్‌లైన్‌ గేమింగ్, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లను ఒక నేరంగా పేర్కొంటూ ఏపీ ఆర్డినెన్స్‌–2020 తెచ్చామని, దానిని 2020 సెప్టెంబర్‌లో నోటిఫై చేశామని పేర్కొన్నారు. వీటిని ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఆయా సైట్‌లను బ్లాక్‌ చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు ఏపీలో ఆయా సైట్లు, యాప్‌లను బ్లాక్‌ చేసేలా ఆదేశించాలని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను సీఎం వైయస్‌ జగన్‌ లేఖలో విజ్ఞప్తి చేశారు. నిషేధించాల్సిన 132 వెబ్‌సైట్ల వివరాలను లేఖకు జత చేశారు. 
 

Back to Top