మంచి చేస్తుంటే విమర్శలా.. పేదల కష్టాలు వారికి తెలుసా..?

 విమర్శించే వాళ్లకు అభివృద్ధి కనిపించడం లేదా?

అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శిస్తున్నాయి

వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమంలో సీఎం వైయ‌స్‌ జగన్‌

 గుంటూరు జిల్లా:  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు,  నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా? అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని   అన్నారు.  గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైయ‌స్ఆర్ పెన్షన్‌ కానుక పెంపును శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానన్నారు.
 
‘‘పెన్షన్‌ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం. సంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా.. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా?. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయి. అత్యధిక  పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. 62 లక్షల మంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేది.

మేం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈనెలలోనే కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెన్షన్‌ కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పెన్షన్‌ కోసం నెలకు రూ.1450 కోట్లు ఖర్చు చేస్తోంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వంలాగా పెన్షన్‌లో కోత లేదు. కుల,మతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నాం. అర్హులందరికీ పెన్షన్‌ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నాం. పడిగాపులు లేకుండా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. లబ్ధిదారులకు ఇబ్బంది ఏర్పడితే వాలంటీర్లను కలవాలి. అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శిస్తున్నాయి. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. సినిమా టికెట్ల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఓటీఎస్‌ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారు. ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

  
ఈ నెలలో కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు:  మంత్రి పెద్దిరెడ్డి
 గత ప్రభుత్వం 36 లక్షల మందికే పెన్షన్‌ ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులే పెన్షనర్లను ఎంపిక చేసేవారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెంచామని తెలిపారు. కుల,మత, రాజకీయాలకతీతంగా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. ఈ నెలలో కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

సీఎం వైయ‌స్ జగన్‌ మాట  నిలబెట్టుకున్నారు..:  మంత్రి సుచ‌రిత‌
 ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. గత ప్రభుత్వం చాలా మంది పెన్షన్లను తొలగించిందన్నారు.  జీవన ప్రమాణాలు పెంపు, సామాజిక భద్రతకు రెండేళ్లలో అనేక కార్యక్రమాలు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టార‌న్నారు.  ఇప్పడు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించడం సంతోషంగా ఉంద‌న్నారు.  అసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చూపించే ఉదారతను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల‌న్నారు.   వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో రూ.75గా ఉండే పింఛన్‌ను 2006 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు  కొత్తగా పింఛన్లు మంజూరు చేశార‌ని గుర్తు చేశారు.  కొత్తగా పింఛన్ల మంజూరులో, లబ్ధిదారుల ఇబ్బందుల పరిష్కారం విషయంలో అప్పటి వైయ‌స్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉదారత చూపిస్తే, ఇప్పుడు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం కూడా ఆదే తరహాలో మేలు చేస్తోంద‌న్నారు.  2020 జనవరి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 18,44,812 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింద‌న్నారు.  ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంద‌న్నారు. వైయ‌స్‌ జగన్‌ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని  మంత్రి  సుచ‌రిత పేర్కొన్నారు.
 

Back to Top