తాడేపల్లి: టెలికాం సేవలతో అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్వర్క్ పరిధిలోకి వస్తాయని, సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయి.. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఇవన్నీకూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయని సీఎం తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...: ఈ రోజు దేవుడిదయతో మరో మంచికార్యక్రమం జరుగుతుంది. గతంలో జూన్లో 100 టవర్లు ఇదేమాదిరిగా ప్రారంభించుకున్నాం. ఈరోజు మరో 300 టవర్లు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కడైతే పూర్తిగా కనెక్టివిటీ లేని పరిస్థితి ఉందో, ఫోన్లలో మాట్లాడడానికి కూడా అనుకూలించని పరిస్థితులు ఉన్న గ్రామాల్లో ప్రారంభించుకుంటున్నాం. సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లాలి. పారదర్శకంగా ఆ సంక్షేమపథకాలన్ని ప్రతి ఇంటికి అందాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ 400 టవర్లును దాదాపుగా రూ.400 కోట్ల పెట్టుబడితో నిర్మించుకున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ 300 టవర్లతో, 2లక్షల మంది జనాభాకు ప్రయోజనం కలిగనుంది. 944 గ్రామాలు వీటి ద్వారా కనెక్ట్ అవుతున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన 100 టవర్లతో 42వేల జనాభాకు ప్రయోజనం కలిగింది. చేరుకోవాల్సిన మార్గం ఇంకా ఉంది. దాదాపుగా ఇంకా మనం మరో 2,400 టవర్లును రానున్న నెలల్లో వేగంగా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 2900 టవర్లును ఏర్పాటు చేయడం ద్వారా... కనెక్టివిటీలేని 5,459 ఆవాసాలను కనెక్టివిటీలోకి తీసుకొచ్చే బృహత్తర ప్రణాళిక ఇది. సుమారు రూ.3119 కోట్లతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించాం. దీన్ని సఫలీకృతం చేసేందుకు కేంద్రంతో మాట్లాడి.. ఇందులో భాగస్వామ్యం చేసేందుకు ఒప్పించాం. టవర్ల నిర్మాణం దిశగా అడుగులు వేగంగా వేయగలిగాం. టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను 2,900 లొకేషన్లలో ఇప్పటికే ఇచ్చాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాం. టవర్ల ఏర్పాటు కోసం పవర్ కనెక్షన్కు అనుమతులు కూడా ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ కూడా రెట్టించిన వేగంతో చేశాం. 2,900 టవర్ల నిర్మాణ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఈ దఫా 300, గతంలో 100 మొత్తం 400 టవర్లు ఏర్పాటు పూర్తయింది. ఇక మిగిలిన టవర్ల నిర్మాణానికి అడుగుల వేగంగా పడుతున్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలకొకసారి... 400 నుంచి 500 టవర్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తూ... మరో ఏడాది కాలంలో అన్ని టవర్ల నిర్మాణం దేవుడిదయతో పూర్తి చేస్తాం. ఈ టవర్లు రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో.. కనెక్టివిటీ లేని ఆవాసాలను సమాజంతో కనెక్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. టీవీలు, ఫోన్లు పనిచేస్తాయి. మనం ఇచ్చే పథకాలు అన్నింటికీ వెంటనే ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. మనం బటన్ నొక్కిన వెంటనే వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే కార్యక్రమం కూడా అంతేవేగంగా జరుగుతుంది. వాళ్లు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వేగవంతంగా, ఎఫెక్టివ్గా, పారదర్శకంగా జరగడం కోసం ఈ కనెక్టివిటీ చాలా అవసరంగా భావించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. గ్రామసచివాలయాలు, ఆర్బీకే వ్యవస్ధలు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడుతో బాగుపడుతున్న ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఇవన్నీ గ్రామాన్ని, గ్రామ రూపురేఖలను మార్చే దిశగా పడుతున్న అడుగులు. అందులో భాగంగానే ఈ కనెక్టివిటీ అన్నది కూడా ఆ అడుగుల్లో ఒక ఉపయోగకరమైన అంశం అవుతుంది. ఈ కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ విషెష్ అని సీఎం తన ప్రసంగం ముగించారు. ఈ సందర్భంగా జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన గిరిజనులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే ఫోన్ చేయాలంటే కొండల పైకి ఎక్కాల్సి వచ్చేది: చిట్టెమ్మ, గిరిజన మహిళ, పాడేరు మండలం, ఏఎస్ఆర్ జిల్లా సార్, మేం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, మాకు పాడేరు హెడ్ క్వార్టర్కు వెళ్ళాల్సి వచ్చేది ప్రతి విషయానికి, గతంలో ఫోన్ చేయాలంటే కొండల పైకి ఎక్కాల్సి వచ్చేది, ఇప్పుడు నేరుగా మా గ్రామానికే సెల్టవర్స్ వేశారు, మాకు సిగ్నల్ కూడా వచ్చింది, మా గ్రామస్తులు అంతా సంతోషంగా ఉన్నారు, మాకు గతంలో సచివాలయం అంటే, కలెక్టర్ అంటే, వలంటీర్ అంటే ఏం తెలీదు, కానీ ఇప్పుడు అందరి గురించి తెలిసింది. జగనన్న మీరు మా బాధలు గమనించి మాకు సాయం చేస్తున్నారు. గతంలో రోడ్లు లేవు, కానీ ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి, మీరు మా వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు, జగనన్నా మీరు మాకు అన్నీ ఇస్తున్నారు, మేం మీ పథకాల ద్వారా లబ్ధిపొంది మా కాళ్ళపై మేం నిలబడ్డాం, మేమంతా కూడా మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు పాడేరు వచ్చినప్పుడు చూడాలనుకుని చూడలేకపోయాను, ఇప్పుడు నేరుగా మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ అన్నా. అన్నా..మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాం: చలపతిరావు, గిరిజనుడు, పార్వతీపురం మన్యం జిల్లా అన్నా, మా గిరిజన గ్రామాలకు ఫోన్ సిగ్నల్ లేదు, 5 కిలోమీటర్లు వెళ్ళి ఫోన్ చేయాల్సి వచ్చేది, ఏదైనా ప్రమాదం జరిగినా అంబులెన్స్ కి చెప్పడానికి కూడా ఫోన్ సిగ్నల్ ఉండేది కాదు, మా బంధువుల కష్టసుఖాలు తెలిసేవి కాదు, కానీ ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడుతున్నాం, మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, నేరుగా టీచర్స్తో మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలిసేది కాదు, కానీ ఇప్పుడు నేరుగా జగనన్నకు చెబుదాం నెంబర్ 1902 కి కాల్ చేసి మాట్లాడగానే మా సమస్య పరిష్కారం అయింది, గతంలో ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు, ఇప్పుడు మాత్రం అన్నీ వెంటనే తెలిసిపోతున్నాయి, మా సచివాలయంలో సిగ్నల్ లేక ఇబ్బందులు పడేవారు, ఇప్పుడు మీ చొరవ వల్ల ఇంటినుంచే అన్నీ తెలుసుకుంటున్నాం, ఏదైనా మా సచివాలయంలో ఇస్తున్నారు, బ్యాంకులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే డబ్బు కూడా తీసుకుంటున్నాం, మాకు సెల్ టవర్ వచ్చిన తర్వాతే నిజంగా సంతోషంగా ఉంది, నిన్నటి కన్నా నేడు, నేటి కన్నా రేపు బావుండాలి, మీరు మళ్ళీ వస్తేనే మాకు చాలా బావుంటుంది, మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాం.