అసెంబ్లీ: పిల్లలకు మనమిచ్చే ఏకైక ఆస్తి చదువే అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచేందుకు, నిరాక్షరాస్యతను రూపుమాపేందుకు సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేసి చూపించామని సీఎం పేర్కొన్నారు. అమ్మ ఒడి కార్యక్రమంపై జరిగిన చర్చలో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమంపై ఇవాళ సభలో చర్చ జరుగుతోంది. ఒక గొప్ప కార్యక్రమం ఇంత వరకు దేశ చరిత్రలో జరగని కార్యక్రమం. రాష్ట్రంలో తొలి సారి జరుగుతున్న కార్యక్రమం. పిల్లలకు మంచి చదువులు అందించాలంటే అడుగులు ఎలా వేయాలన్న చర్చ జరుగుతోంది. కాసేపటి క్రితమే మన ఎమ్మెల్యేలు కొన్ని లెక్కలు చెప్పారు. రాష్ట్రంలో నిరాక్షరాస్యత 33 శాతం ఉంది. దేశంతో పోల్చితే 27 శాతం ఉంది. దేశం కన్న దారుణంగా మన రాష్ట్రంలో చదువు రాని వారు ఎక్కువగా ఉన్నారు. కాలేజీల విషయం పరిశీలిస్తే.. జీఈఆర్ రేషియే చూస్తే 23 శాతమే చదువులు కొనసాగిస్తున్నారు. ఇది మారాలంటే పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి. ఈ ఆస్తి అన్నది క్వాలిటీలో కూడినది ఇవ్వాలి. విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకువచ్చేందుకు నాలుగు అడుగులు వేశాం. మొదటి అడుగు అమ్మ ఒడి. దాదాపుగా 82 లక్షల పిల్లల భవిష్యత్ మార్చేందుకు, ఆ పిల్లలకు చదువులకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి కార్యక్రమం శ్రీకారం చుట్టాం. 42,33, 908మంది తల్లులకు మేలు చేసే కార్యక్రమం చేపట్టాం. ఈ గొప్ప కార్యక్రమం చేపట్టేందుకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి, ప్రజలకు రుణపడి ఉంటాం. అక్షరాల రూ.6028 కోట్లు ఒకేసారి ఆ తల్లుల అకౌంట్లలో జమా చేశాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కేవలం నాలుగు, ఐదు రోజుల్లోనే డబ్బులు జమా చేశాం. కొన్ని కారణాల వల్ల 2 లక్షల మంది తల్లులకు ఆలస్యమైంది. ఈ రోజు మరో ఒక లక్ష మంది తల్లులకు జమా చేశాం. వారం రోజుల్లో టెక్నికల్ సమస్యలు తొలగించి అందరికి డబ్బులు జమా చేస్తాం. తల్లులను చైతన్యవంతం చేస్తూ వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలకు మంచి చదువులు చదివించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ రోజు నుంచి మధ్యాహ్న భోజన పథకంలో మార్పు తీసుకువస్తున్నాం. ప్రతి రోజు కూడా ఏమి పెడుతామన్నది కూడా పరిశీలించి..పిల్లల్లో భోజన నాణ్యతను పెంచుతూ ప్రతి రోజు ఒకరకమైన భోజనం పెట్టేలా మెనూ మార్పు చేశాం. ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు ఏం తింటున్నారు. రోజు ఇదే భోజనం ఎలా తింటారని ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేసి ఉండరు. ఆ మాత్రం పిల్లలను పట్టించుకోకపోతే చదువులు చెప్పించలేం. ఈ కార్యక్రమంలో నేను కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను.ప్రతి రోజు మెనూ మార్పు చేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్దా అని నామకరణం చేస్తున్నాం. ఈ పథకంలోని ఆయాలకు గతంలో కేవలం రూ.1000 ఇచ్చేవారు. అది కూడా బకాయిలు పెట్టేవారు. ఆరు నుంచి 8 నెలల వరకు బిల్లులు ఇచ్చేవారు కాదు. సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే క్వాలిటీ ఎక్కడ ఉంటుంది. అందుకే ఆయాలకు ఇచ్చే రూ.1000ని రూ.3000 పెంచాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ఈ ప్రోత్సాహకం పెంచాం. మధ్యాహ్న భోజన పథకానికి రూ.344 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. అయినా కూడా పిల్లలకు ఖర్చు చేస్తే ఎక్కువ కాదని మనస్ఫూర్తిగా భరిస్తున్నాం. నాణ్యతను పరిశీలించేందుకు నాలుగు దశలను ఏర్పాటు చేశాం. పేరెంట్ కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశాం. ఆ కమిటీ నుంచి సబ్ కమిటీగా ఏర్పాటు చేస్తాం. వీరు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తారు. గ్రామ సచివాలయంలో ఉన్న విద్యాశాఖ వెల్పేర్ అసిస్టెంట్కు కూడా ఆదేశాలు ఇచ్చాం. రోజు మరిచి రోజు స్కూల్కు వెళ్లి క్వాలిటీ వెళ్లాలి. ప్రతి రోజు హెచ్ఎం ఆధ్వర్యంలో రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పొదుపు సంఘాలు కూడా తనిఖీ చేసేలా చూస్తున్నాం. ఆర్డీవో స్థాయి అధికారిని కూడా నియమించే కార్యక్రమం చేస్తున్నాం. పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి. మంచి క్వాలిటీ ఇవ్వాలనే తపనతో ఇవన్నీ చేస్తున్నాం. ఎక్కడా కూడా అవినీతి అన్నది ఉండకూడదు. గుడ్ల టెండర్లలో పౌల్ట్రీ యజమానులే పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నాం. మూడో అడుగు ఇంగ్లీష్ మీడియం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నాం. రైట్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేలా మార్పులు తెస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం చదువులతో పిల్లల జీవితాలు బాగుపడుతాయి. ప్రపంచంతో పోటి పడే పరిస్థితి మెరుగవుతుంది. 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం. ఆ తరువాత ఏటా ఒక్కో తరగతి చొప్పున పది వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తాం. కరికుళంలో కూడా మార్పులు తెస్తున్నాం. యూనివర్సిటీ ఆఫ్ చికాగో, సింగపూర్, అక్సఫర్డ్ యూనివర్సిటీలతో మన విద్యాశాఖ సంప్రదిస్తోంది. మంచి పుస్తకాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. యాక్టివిటీ బేస్ నుంచి పుస్తకాలు తీసుకువస్తున్నారు. స్కూల్ తెరిచే సమయానికి పిల్లలకు పుస్తకాలు ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. స్టేట్ రిసోర్స్ పర్సన్స్ను ట్రైన్ చేస్తున్నారు. మంత్లీ ఓరియెంటేషన్, సెల్ప్ లైర్నింగ్ యాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా చేస్తూ తెలుగును ప్రతి స్కూల్లోనూ తప్పనిసరి చేస్తున్నాం. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తున్నాం. నాడు-నేడు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 వేల స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. వీటిలో మార్పులు జరగాలి. స్కూళ్లలో మౌలిక వసతులు ఉండాలి. 9 రకాల మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నాం. మరుగుదొడ్లు, మంచినీరు, కాంపౌండ్వాల్, ఇంగ్లీష్ ల్యాబ్ వంటివి ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది 15,700 స్కూళ్లను బాగు చేస్తున్నాం. ఇప్పటికే 12 వేల స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయి. పర్నిచర్, గ్రీన్బోర్డు, ఫ్యాన్స్ అన్నవి కూడా టెండర్ల ద్వారా అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి అడుగులోనూ కూడా మార్పులు తీసుకువస్తున్నాం. స్కూల్స్ మొదలయ్యేది జూన్ 12, జూన్ 1వ తేదీన ప్రతి పిల్లాడికి ఒక కిట్ ఇస్తాం. దాని విలువ రూ.1350 ఖర్చు అవుతుంది. ఆ కిట్లో ప్రతి పిల్లాడికి స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, మూడు జతల యూనిఫాం, కుట్టుకూలి కూడా తల్లులకు ఇస్తాం. బూట్లు కూడా ఇస్తాం, రెండు జతల సాక్స్లు, బెల్ట్ ఇస్తాం. దీనిపేరు జగనన్న విద్యా కానుకగా నామకరణం చేస్తున్నాం. దాదాపుగా 36 లక్షల మందికి మేలు జరుగుతుంది. ఫిబ్రవరిలో జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రతి పిల్లాడికి కూడా హాస్టల్ ఖర్చులు, మెస్ చార్జీలకు ప్రతి తల్లికి ఏడాదికి రూ.20 వేలు ఇవ్వబోతున్నాం. రెండు విడతల్లో ఈ కార్యక్రమం చేస్తాం. జూలై, ఆగస్టు మాసంలో రెండో విడతలో డబ్బులు ఇస్తాం. ప్రతి పిల్లాడికి కూడా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం. ఈ సంస్కరణల వల్ల దేవుడి ఆశీస్సులతో, ప్రజలందరి దీవెనలతో ఇంకా గొప్పగా ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా..