ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేగం పెంచండి 

నిర్మాణ పనుల్లో ఎక్క‌డా ఆలసత్వం ఉండొద్దు

జ‌ల‌వ‌న‌రుల శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

పోల‌వ‌రం, నెల్లూరు బ్యారేజీ, అవుకు ట‌న్నెల్‌, తోట‌ప‌ల్లి వెలిగొండ‌, త‌దిత‌ర‌ ప్రాజెక్టుల‌పై చ‌ర్చ‌

తాడేప‌ల్లి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని, ఎక్క‌డా అల‌స‌త్వం ఉండొద్ద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇరిగేష‌న్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. జలవనరుల శాఖపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  అధికారులు పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సీఎంకు వివరించారు. దిగువ కాపర్‌ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ తదితర అంశాలపై చ‌ర్చించారు. ఆర్‌ అండ్‌ ఆర్ ‌పనులపైనా ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్ర‌భుత్వం రీయింబర్స్‌ చేయాల్సిన నిధులకు సంబంధించిన వివ‌రాల‌ను సీఎంకు వివ‌రించారు. కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన డబ్బు రూ.2,033 కోట్లకు పైనే ఉందని తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. పోల‌వ‌రం గ్యాప్‌ 3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామని, ఎగువ కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేసి, వచ్చే ఖరీప్‌ నాటికి కాల్వల ద్వారా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎంకు వివ‌రించారు. దిగువ కాపర్‌ డ్యామ్‌ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులను ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. 

ఇతర ప్రాజెక్టుల ప్రగతిపైస‌మీక్ష‌.. 
నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేశామని, నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు. అదే విధంగా అవుకు టన్నెల్‌ నిర్మాణ పనుల్లో గణనీయ ప్రగతి సాధించామని తెలిపారు. ఫాల్ట్‌జోన్‌లో తవ్వకాలు జరిపి.. పటిష్టపరిచే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నామన్నారు. వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తిచేసి ఆ టన్నెల్‌ ద్వారా నీటిని ఇవ్వగలుగుతామని తెలిపారు. పనులు వేగవంతం చేయాలని, ఆలసత్వం ఉండొద్దని సూచించారు.  

వెలిగొండ ప్రాజెక్టు పనులపై.. 
వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ పనుల వేగం పెంచాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. వంశధార స్టేజ్‌ –2 ఫేజ్‌ –2 పనులన్నింటినీ కలిపి వచ్చే మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నిర్దేశించుకున్న సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నేరడివద్ద బ్యారేజీ నిర్మాణంకోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒడిశా రాష్ట్రంతో చర్చల కోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తోటపల్లి బ్యారేజీకింద పూర్తిస్థాయిలో వచ్చే ఖరీఫ్‌నాటికి నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అదికారులు వివ‌రించారు. వెంటనే పనులు పూర్తిచేయాలని, మహేంద్ర తనయను పూర్తిచేయడంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని సూచించారు. గులాబ్‌ తుపాను, అనంతర వర్షాల కారణంగా ఎక్కడైనా ఇరిగేషన్‌ కాల్వలు దెబ్బతింటే వాటిని బాగుచేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

గోదావ‌రి, కృష్ణా డెల్టాల‌లో రెగ్యులేట‌ర్ నిర్మాణ ప‌నులు..
కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాలలో రెగ్యులేటర్‌ నిర్మాణ పనులను ప్రాధాన్యాత క్రమంలో చేపట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. తాండవ ప్రాజెక్టు విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపైనా దృష్టిపెట్టాల‌ని సూచించారు. తాండవ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లను పిలిచామని, తొలివిడత టెండర్ల ప్రక్రియలో అధికంగా కోట్‌ చేసిన పనులకు సంబంధించి మరోసారి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.  

ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ పి అనిల్‌ కుమార్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, జలవనరులశాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు, నిర్మాణ సంస్ధల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top