తాడేపల్లి: సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వంశధార, తోటపల్లి, పోలవరం, వెలిగొండ, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ, పునరావాస పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో వెలిగొండ అందుబాటులోకి వస్తుందని, గండికోట, చిత్రావతిలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే పునరావాస పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పునరావాస పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 41.5 ఎత్తు వరకూ ఎక్కడా ముంపునకు గురికాకుండా ప్రభావితమైన వారిని తరలించే కార్యక్రమాలు చురుగ్గా చేపట్టాలన్నారు. పునరావాస కాలనీల్లో కూడా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.