డెయిరీ రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం 

అమూల్‌ ప్రాజెక్ట్‌పై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

గుంటూరు జిల్లాలో 'అమూల్‌ పాల వెల్లువ' ప్రాజెక్ట్ ప్రారంభం

పాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్  జగన్‌

తాడేపల్లి: డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అమూల్‌ ప్రాజెక్ట్‌పై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలో 'అమూల్‌ పాల వెల్లువ' ప్రాజెక్ట్‌ను వర్చువల్‌ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతూ.. పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. అమూల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాలసేకరణను చేపట్టామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాలసేకరణకు శ్రీకారం చుట్టామని.. చిత్తూరు జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాలసేకరణ  కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.  

ఏపీ–అమూల్‌ పాలవెల్లువ ప్రాజెక్టులో భాగంగా, ఇప్పటికే ప్రకాశం చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాలలో 400 గ్రామాల్లో అమూల్‌ సంస్థ పాలు సేకరిస్తుండగా, కొత్తగా గుంటూరు జిల్లాకు ప్రాజెక్టును విస్తరించారు. 
గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతో పాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్‌ ద్వారా పాల సేకరణను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. 
గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ సమాఖ్య (జీసీఎంఎంఎఫ్‌ – అమూల్‌) ఎండీ ఆర్‌ఎస్‌ సోధి, సబర్‌కాంత సహకార సంఘం ఎండీ డాక్టర్‌ బీఎం పటేల్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 అక్కచెల్లెమ్మల మేలు కోసం:

    ‘ఈరోజు గుంటూరు జిల్లాలో కార్యక్రమానికి నాంది. ఇప్పటికే మూడు జిల్లాలలో దాదాపు 400 గ్రామాలలో అమూల్‌ పాలు సేకరిస్తోంది. ప్రభుత్వంతో కలిసి అమూల్‌ పని చేస్తుంది. గత ఏడాది జూలై 21న అమూల్‌తో ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. పాడి రైతులు అయిన అక్క చెల్లెమ్మలకు మేలు చేయడం కోసం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ మేరకు గత ఏడాది డిసెంబరు 2న రాష్ట్రంలో అమూల్‌ పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైంది. 400 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతుండగా, వాటిలో ప్రకాశం జిల్లాలో 200 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 100, వైయస్సార్‌ కడప జిల్లాలో మరో 100 గ్రామాలు ఉన్నాయి’.
    ‘ఇప్పుడు గుంటూరు జిల్లాలో 129 గ్రామాలు, చిత్తూరులో మరో 174 గ్రామాల నుంచి పాల సేకరణ మొదలవుతోంది. అమూల్‌ రాకతో 400 గ్రామాల్లో అక్క చెల్లెమ్మల జీవితాలు మారాయన్నది సుస్పష్టం’.

లీటరుపై రూ.7 వరకు..:

    ‘అమూల్‌ రాకతో ప్రతి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా వస్తోందని అక్క చెల్లెమ్మలు చెబుతున్నారు. పులివెందులలో కూడా పాలు సేకరిస్తున్నారు. అమూల్‌ సంస్థ అక్కచెల్లెమ్మలకు అదనంగా రేటు ఇవ్వగలుగుతోంది అంటే.. అందుకు కారణం ఆ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అది ప్రైవేటు సంస్థ కాదు, అది ఒక సహకార సంస్థ. అందులో వాటాదారులు అక్క చెల్లెమ్మలే. ఆ సంస్థ అధిక ధరలకు పాలు కొనుగోలు చేయడమే కాకుండా, సంస్థకు వచ్చే లాభాలను తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తుంది. అదీ సహకార సంస్థ ప్రత్యేకత’.

అందుకే ఆ లాభాలు:

    ‘అమూల్‌ చేసే ప్రాసెసింగ్‌ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆ సంస్థ పాల నుంచి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు కూడా తయారు చేస్తోంది. అందుకే పాలకు మంచి ధర ఇస్తోంది. అమూల్‌ ఉత్పత్తులు విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అందుకే లాభాలు వస్తున్నాయి. అమూల్‌ మన రాష్ట్రానికి రావడం విప్లవాత్మక పరిణామం అని చెప్పుకోవాలి’.

అదనంగా రూ.3.52 కోట్లు:

    ‘గత ఏడాది డిసెంబరు నుంచి ప్రకాశం, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాలలో ఇప్పటి వరకు 10,871 మహిళా పాడి రైతుల నుంచి 41.44 లక్షల లీటర్ల పాలు సేకరించిన అమూల్‌ సంస్థ ఆ రైతులకు రూ.18.46 కోట్లు చెల్లించింది. ఇతర డెయిరీలు చెల్లించిన మొత్తం కంటే రూ.3.52 కోట్లు అదనంగా అమూల్‌ రైతులకు ఇచ్చింది’.

సహకార డెయిరీలకు పూర్తి ప్రోత్సాహం:

    ‘అమూల్‌ను మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చడం కోసం.. మహిళా డెయిరీ సహకార సంఘాల (ఎండీఎస్‌ఎస్‌)కు పూర్తి ప్రోత్సాహం అందించే విధంగా ఇప్పటికే 9899 గ్రామాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆయా గ్రామాలలో పాల సేకరణ కేంద్ర భవనాల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. అందుకు దాదాపు దాదాపు రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఆ మేరకు పెద్ద ఎత్తున ‘ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ)’, ‘బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ)’ల నిర్మాణం మొదలు పెట్టింది’.

10 రోజులకోసారి నగదు జమ:

    ‘గతంలో ఏనాడూ కూడా పాల నాణ్యత అనేది పాడి రైతుల సమక్షంలో జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఏఎంసీయూ, బీఎంసీయూల ఏర్పాటు ద్వారా ఆ ప్రక్రియ పాడి రైతుల సమక్షంలోనే జరుగుతుంది. అదే విధంగా పాల సేకరణ తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి అమూల్‌ సంస్థ రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది’.

మహిళా పక్షపాత ప్రభుత్వం:

    ‘ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. అందుకే ప్రతి పథకంలో వారికి ప్రాధాన్యం. అమ్మ ఒడి, 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాలు, దిశ చట్టం, సున్నా వడ్డీ రుణాలు, ఆసరా, చేయూత పథకాలు, నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో సగం ఇస్తున్నాం. ఇలా ప్రతి అడుగులో ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకు వేసింది. ఇప్పుడు అమూల్‌ వల్ల ఇంకా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది’.

అమూల్‌తో రెండు లాభాలు:

    ‘అమూల్‌ వల్ల రెండు మంచి పనులు. ఒకటి లీటరుకు రూ.7 వరకు ఎక్కువ ధర. రెండోది మోసం లేదు. ఏఎంసీయూ, బీఎంసీయూల ద్వారా రైతుల సమక్షంలోనే పాల నాణ్యత పరిశీలన. తద్వారా కూడా ఆ పాలకు మంచి ధర వస్తోంది. గతంలో రైతుల ముందు పాల నాణ్యత పరిశీలన ఉండేది కాదు. కానీ ఇప్పుడు అంతా పారదర్శకం’.

ఆర్బీకేల ద్వారా దాణా:

    ‘పాడి గేదెలు కావాలని మహిళా పాడి రైతులు కోరుతున్నారు. అయితే, చేయూత పథకంలో దీన్ని చేర్చడం జరిగింది. ఆ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలు పాడి గేదెలు తీసుకోవచ్చు. అ విధంగా అందరికీ మంచి జరగాలి. రాబోయే రోజుల్లో ఏఎంసీయూ, బీఎంసీయూల రాకతో పాల సేకరణ  చాలా బాగుంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను అందిస్తాం’.. అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

వారే మా సంస్థ యజమానులు: ఆర్‌ఎస్‌ సోధి. అమూల్‌ ఎండీ

– ‘రాష్ట్రంలో పాడి రైతులకు ప్రయోజనం కల్పించడంలో అమూల్‌ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందని తెలిసింది. ఇది చాలా ఎక్కువ ఉత్పత్తి అని చెప్పొచ్చు. 36 లక్షల మహిళా పాడి రైతులు అమూల్‌లో భాగస్వాములే. వారే ఆ సంస్థ యజమానులు. ఇప్పుడు ఏపీలో కూడా పాడి మహిళా రైతులకు మేలు చేసే విధంగా అమూల్‌ పని చేస్తుంది. వారికి అండగా నిలుస్తుంది. పాల సేకరణ కేంద్రాలలో ఆటోమేటిక్‌ యంత్రాలు ఉంటాయి. అవి పాడి రైతుల ముందే పాల నాణ్యతను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. ఆ పాలకు ఎంత ధర గిట్టుబాటు అవుతుందన్నది కూడా తెలుస్తుంది. ఇవన్నీ రాష్ట్రంలో మహిళా పాడి రైతులకు కూడా ఎంతో మేలు చేస్తాయి’.

    మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఆ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ ఎ.బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్సు ద్వారా జీసీఎంఎంఎఫ్‌ (అమూల్‌) ఎండీ ఆర్‌ఎస్‌ సోధి, సబర్‌కాంత సహకార సంఘం ఎండీ డాక్టర్‌ బీఎం పటేల్‌తో పాటు, గుంటూరు జిల్లా నుంచి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజని, ఇంకా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా పాడి రైతులు హాజరయ్యారు.

Back to Top