`నాడు – నేడు`తో స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరిగింది

పిల్లల సంఖ్య‌కు తగ్గ‌ట్టుగా వసతులు, బోధనా సిబ్బందిపై దృష్టిపెట్టాలి

స్కూళ్ల మ్యాపింగ్‌కు అనుగుణంగా సిబ్బంది నియామకం

ఎప్పటికప్పుడు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును అందించాలి

గోరుముద్దలో ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టిపెట్టాలి 

విద్యాశాఖ అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ``నాడు – నేడు`` తర్వాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల‌న్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాల‌ని విద్యాశాఖ అధికారుల‌కు సూచించారు. విద్యా శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్కూళ్ల మ్యాపింగ్, జగనన్న విద్యాకానుక, నాడు –నేడు రెండో దశ, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, టాయిలెట్ల నిర్వహణ, స్వేచ్ఛ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. 

సీఎం వైయస్ జగన్‌ ఏమన్నారంటే..
``స్కూళ్ల మ్యాపింగ్‌కు అనుగుణంగా సిబ్బంది నియామకం, నాడు–నేడు తర్వాత పిల్లల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అదనపు వసతుల కల్పన– స్కూళ్లలో ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణ, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది.. ఈమూడు అంశాలపై దృష్టిపెట్టాలి. ఎప్పటికప్పుడు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును అందించాలి. 

వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలి..
నూతన విద్యావిధానం ప్రకారం ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేశాం. ఇప్పటికే కొన్నింటిని ఈ కొత్త విధానం ప్రకారం ఏర్పాటు చేశారు. మిగిలిన స్కూళ్ల మ్యాపింగ్‌పై దృష్టిపెట్టాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలి. ఆ మేరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలు, ఇతరత్రా అవసరాలను గుర్తించి వారిని నియమించాలి. 

పిల్లల సంఖ్యకు తగినట్టుగా..
నాడు – నేడు కార్యక్రమం వల్ల స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో పిల్లల సంఖ్యకు తగినట్టుగా మళ్లీ అక్కడ ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి. పిల్లల సామర్థ్యానికి తగినట్టుగా వసతులు, బోధన సిబ్బందిని పెట్టాల్సి ఉంటుంది. నాడు – నేడు మొదటి దశ, రెండో దశ తర్వాత పెరిగే పిల్లల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అదనపు తరగతి గదులు, అదనంగా ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులు, నియమించాల్సిన బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.

పట్టించుకోకపోతే.. పనులకు అర్థంలేదు
నాడు–నేడు ద్వారా స్కూళ్లలో ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలి. దీనికి గురించి పట్టించుకోకపోతే నాడు–నేడు కింద చేపట్టిన పనులకు అర్థంలేదు. దీనిపై ఒక కార్యాచరణ సిద్ధంచేసుకోవాలి. ఈ మూడు అంశాలపై యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును నివేదించాలి.  

వారి సూచనలతో ముందుకెళ్లాలి..
సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది ఉండాలని స్పష్టంచేశాం. దీన్ని అమలు చేయడంలో ఉపాధ్యాయుల సహకారాన్ని తీసుకోవాలి. ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలి. పిల్లలకు మంచి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలతో ముందుకెళ్లాలి. 

టీచర్లకు ఇంగ్లిషు బోధనపై శిక్షణ కార్యక్రమాల వివరాలు అందించిన అధికారులు. ఇంగ్లిషులో పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్‌ను బాగా వినియోగించుకునేలా చూడాలి. జిల్లా అధికారులు నిరంతరం స్కూళ్లను పర్యవేక్షించాలి. 

నాణ్యత పరిశీలన కొనసాగాలి..
గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలి. వసతుల్లో, నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే నమోదుచేసి వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టిపెట్టాలి. మన ఇంట్లో మనం తినే తిండి ఎంత శుచిగా ఉండాలనుకుంటామో, టాయిలెట్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలనుకుంటామో.. స్కూళ్లలో వండే ఆహారం అంతే నాణ్యతగా ఉండాలి. టాయిలెట్లు కూడా అంతే పరిశుభ్రతతో ఉండాలి. ప్రభుత్వ పాఠశాల అనేది అందరిదీ అనే భావన రావాలి.

అంగన్‌వాడీలుపై సమీక్ష..
అంగన్‌వాడీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్‌ క్లినిక్స్‌ దృష్టిపెట్టాలి. ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు నిర్వహించాలి. రక్తహీనత లాంటి సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది. పీహెచ్‌సీ డాక్టర్లకు అనుసంధానం చేస్తే వారు తగిన చికిత్సను అందిస్తారు`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. 

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ. ఆర్‌. అనురాధ,ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (మిడ్‌ డే మీల్స్‌) డైరెక్టర్ బీ. ఎం. దివాన్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ.మురళీ, సర్వశిక్షాఅభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి. రాములు, కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ బి. ప్రతాప్‌ రెడ్డి, ఇతరఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top