తాడేపల్లి: వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని, మెడికల్ కాలేజీల నిర్మాణంలో నిధుల కొరత అనేది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కోవిడ్ నివారణ చర్యలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకొని టెండర్లు నిర్వహించిన కాలేజీల్లో పనులు ప్రారంభించాలని సూచించారు. ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మెడికల్ కాలేజీల కోసం భూసేకరణ, నిధుల కేటాయింపుల్లో జాప్యం జరగకూడదదన్నారు. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీలకు టెండర్లు అవార్డు అయ్యాయని, మిగిలిన 12 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈనెల 21వ తేదీ లోగా ప్రారంభమవుతాయని సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరించారు.